పెద్దపల్లి : రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికాభివృద్ధిని సాధించి ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కుమ్మరికుంట గ్రామంలో మంగళవారం మంత్రి పర్యటించి కుట్టుమిషన్లు, చెక్కుల పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మహిళలకు కుట్టు శిక్షణ నేర్పించి ఆర్థికంగా, ఆత్మస్థైర్యం కల్పించామని అన్నారు
నేర్చుకున్న వృత్తిలో మరింత నైపుణ్యత సాధించాలని సూచించారు. జిల్లాలోని మూడు నియోజవర్గాల్లోని 259 మందికి దళిత బంధు యూనిట్లను అందజేశామని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా దళిత బంధును అమలు చేస్తున్నామని వెల్లడించారు. రానున్న ఏడెండ్లలో రాష్ట్రంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు అందిస్తామని తెలిపారు.
రాష్ట్రంలో రైతులు సంతోషంతో ఉండడానికి తెలంగాణ ప్రభుత్వమే కారణమని అన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో పేదలకు అతి తక్కువగా పెన్షన్లు అందుతున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ , ఆర్డీవో వెంకట మాధవ రావు, ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి, వైస్ ఎంపీపీ రమేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ చుక్కా రెడ్డి, సర్పంచ్ మేచినేని సంతోష్ రావు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.