హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): బాలికలు, మహిళల మిస్సింగ్ కేసుల ట్రేసింగ్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని ఉమెన్ సేఫ్టీవింగ్ అడిషనల్ డీజీ శిఖాగోయెల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో తప్పిపోయిన కేసుల్లో 87 శాతం ట్రేసింగ్ నమోదైనట్టు తెలిపారు.
జాతీయ స్థాయిలో బాలికల ట్రేసింగ్ 62 శాతం ఉండగా, మహిళల ట్రేసింగ్ 53 శాతంగా నమోదైనట్టు వివరించారు. పోలీసుల అలుపెరగని కృషితో మొత్తంగా మిస్సింగ్ కేసుల ట్రేసింగ్లో 87 శాతంతో దేశంలోనే తొలి స్థానంలో ఉన్నట్టు పేర్కొన్నారు. తప్పిపోయిన బాలికలు, మహిళల్లో 99.9 శాతం మందికి తీవ్రమైన నేరాలతో సంబంధాలు లేవని వివరించారు.