హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉమెన్ సేఫ్టీవింగ్ నేతృత్వంలోని ‘స్టేట్ నోడల్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్’ బుధవారం రాత్రి 26 మంది చిన్నారుల అక్రమ రవాణాను అడ్డుకొన్నది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జీఆర్పీ, ఆర్పీఎఫ్ బృందాల సాయంతో ఎనిమిది మంది ట్రాఫికర్స్ను అదుపులోకి తీసుకున్నది.
ఈ ఆపరేషన్లో ‘బచ్పన్ బచావో ఆందోళన్’ అనే ఎన్జీవో కూడాభాగస్వామ్యమైంది. ఈ చిన్నారులను పశ్చిమబెంగాల్, జార్ఖండ్ నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నట్టు సమాచారం అందగా, విజయవాడ నుంచి సికింద్రాబాద్ వెళ్లే ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్లో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి, 26 మంది చిన్నారులను కాపాడారు. పిల్లలను తరలిస్తున్న రంజాన్ మొల్లా, షేక్ సైదుల్, పింటు దాస్, సుసేన్ టుడూ, ప్రియారుల్ షేక్, ఎస్కే జాకిర్ అలీ, అబ్దుల్ అలమిన్ మొండెల్, సురోజిత్ సంత్రాను అరెస్టు చేశారు. పిల్లలను వసతి గృహానికి తరలించారు. బాధిత చిన్నారుల వయసు 13 నుంచి 18 ఏండ్ల మధ్య ఉన్నది.