మెదక్ : కాంగ్రెస్ పాలనలో(Congress) ప్రజల కష్టాలు తప్పడం లేదు. సాగు నీరు దేవుడెరుగు తాగు నీరు కోసం సైతం ప్రజలు అల్లాడి పోతున్నారు. తాజాగా మెదక్(Medak) జిల్లా కొల్చారం మండలం నాయిని జలాల్పూర్ గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడితో( Drinking water) బాధపడుతున్నారు. నెల రోజుల నుంచి మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహిళలు ఖాళీ బిందెలతో గ్రామ పంచాయతీ ఎదుట నిరసన చేపట్టారు. గ్రామపంచాయతీ వాటర్ ట్యాంకర్ ద్వారా నీళ్లు పోస్తున్నప్పటికీ అవి సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మిషన్ భగీరథ నీరు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తక్షణమే నీటీ సదుపాయం కల్పించాలని గ్రామస్తులు కోరారు. తాగడానికి సైతం నీళ్లు రావడంలేదని డబ్బులు వెచ్చించి తాగడానికి నీటిని కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. రోజువారి అవసరాలకు నీళ్లు దొరక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.
పిల్లలను పాఠశాలకు పంపాలంటే నీళ్లు లేక స్నానాలు చేయించడం లేదన్నారు. సరైన వర్షాలు కురవక భూగర్భ జలాలు అడుగంటి బోరుబావులు ఎండిపోవడంతో గ్రామంలో నీటి నీటి ఎద్దడి ఏర్పడింది. ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ స్పందించి గ్రామంలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.