హైదరాబాద్ : సంఘ సంస్కర్త సావిత్రిబాయి ఫూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ ప్రభుత్వం అనేక మహిళా కార్యక్రమాలను చేపడుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా ఆమెకు నివాళి అర్పించారు. ఆయన మాట్లాడుతూ విద్య ద్వారానే మహిళల వికాసం జరుగుతుందని నమ్మి, తొలి ఉపాధ్యాయురాలుగా విద్యను బోధించారని గుర్తు చేశారు. మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించి, దళిత, బహుజన స్త్రీ జనోద్దరణ కోసం తన జీవితాంతం కృషి చేసిన మహనీయురాలు సావిత్రిబాయి అని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల వికాసం, సాధికారత కోసం బాలికల విద్య, సంక్షేమం, భద్రత, అభివృద్ధికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం కేజీబీవీలను పక్కన పెట్టగా కేసీఆర్ ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ కేజీబీవీలను గతంలో కంటే గొప్పగా కొనసాగిస్తోందన్నారని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మహిళలకు తొలిసారిగా డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలు పెట్టిన ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు.
ఇంటర్ తర్వాత మహిళలు విద్య మానేయకుండా కొనసాగించేందుకు 53 డిగ్రీ కాలేజీలు ప్రారంభించిందని వెల్లడించారు. మహిళల పేరుపై ఇండ్ల మంజూరు, పట్టాలు, రేషన్ కార్డులు, పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, న్యూట్రిషన్ కిట్స్, కేసీఆర్ కిట్స్ అందజేస్తుందని వివరించారు. సావిత్రిబాయి పూలే ఆశయాలను ఆచరణలో అమలు చేస్తూ ఆమెకు నిజమైన నివాళులు తెలంగాణ ప్రభుత్వం అర్పిస్తుందని అన్నారు.