Bandi Sanjay | మహిళలపై సామెతలను ప్రయోగిస్తూ ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మహిళా కమిషన్ హెచ్చరించింది. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపట్ల తీవ్రంగా స్పందించింది. మరోమారు మహిళలను ఉద్దేశించి కించపరిచే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కవిత పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. శనివారం రాష్ట్ర మహిళాకమిషన్ ఎదుట హాజరయ్యారు. తన వ్యాఖ్యలపై ఆయన రాతపూర్వకంగా సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో మహిళాకమిషన్ అతని వ్యాఖ్యలపట్ల సీరియస్గా స్పందించింది. మరోమారు మహిళలను ఉద్దేశించి సామెతలను ప్రయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని అంటూనే.. చింతిస్తున్నట్టు రెండు పేజీల సంజాయిషీని కమిషన్కు సమర్పించారని సమాచారం. బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న రాష్ట్ర మహిళాకమిషన్.. ఈనెల 15న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున శనివారం హాజరవుతానని సమాధానం ఇచ్చారు బండి సంజయ్. ఉదయం 11 గంటలకు విచారణ నిమిత్తం మహిళాకమిషన్కు తన న్యాయవాదితో వచ్చారు. అయితే న్యాయవాదిని లోపలికి అనుమతించకుండా.. బండి సంజయ్ని మాత్రమే విచారణకు రమ్మని కమిషన్ ఆదేశించింది.
రెండున్నర గంటల విచారణ
బండి సంజయ్ని మహిళాకమిషన్ దాదాపు రెండున్నర గంటలపాటు విచారించింది. అతను చేసిన వ్యాఖ్యల పట్ల రాష్ట్ర మహిళా కమిషన్ గట్టిగా నిలదీసినట్టు సమాచారం. గతంలో ఇలాగే మహిళలు, కవిత పట్ల అతను తప్పుగా మాట్లాడిన వీడియోలు ప్రదర్శించి మరీ క్లాస్ తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. అలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయటంతో.. మిన్నకుండిపోయారట బండి సంజయ్. ఇక కమిషన్ సంధించే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక నీళ్లు నమిలిన బండి సంజయ్.. తప్పుడు వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారని తెలిసింది. అయితే.. తాను ఉద్దేశపూర్వకంగా కవితపై వ్యాఖ్యలు చేయలేదని, సామెతను మాత్రమే అర్థమయ్యేలా చెప్పానంటూ సంజాయిషీ ఇచ్చుకున్నట్టు తెలిసింది. కమిషన్ సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. తాను కవితను అక్కగా సంబోధించానని, మరోమారు అట్లాంటి వ్యాఖ్యలు చేయబోనని సంజాయిషీ ఇచ్చుకున్నట్టు తెలిసింది.
బండి సంజయ్ ఇచ్చిన సంజాయిషికి తృప్తి చెందని మహిళా కమిషన్.. అతన్ని మరోమారు విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. కమిషన్ చేసిన సూచనలకు తాను కట్టుబడి ఉన్నానంటూ విచారణ అనంతరం మీడియాతో చెప్పారు సంజయ్. తాను చెప్పిన విషయాలను స్టేట్మెంట్ రూపంలో రికార్డు చేశారని, తప్పు చేయలేదు కాబట్టే విచారణకు హాజరయినట్టు మీడియాకు తెలిపారు. న్యాయాధికారాలు కలిగిన రాష్ట్ర మహిళాకమిషన్ ఆదేశాలను పాటిస్తానని, కమిషన్పై గౌరవం, నమ్మకం ఉన్నాయని చెప్పారు. బండి సంజయ్ని విచారించిన బృందంలో రాష్ట్ర మహిళాకమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి, సభ్యులు షహీన్ అఫ్రోజ్, కుమ్రా ఈశ్వరీబాయి, కొమ్ము ఉమాదేవి, గద్దల పద్మ, సుద్ధం లక్ష్మి, కటారి రేవతి, కమిషన్ సెక్రటరీ కృష్ణకుమారి ఉన్నారు.
బండి సంజయ్ తెలంగాణ మహిళా లోకానికి వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్, భారత జాగృతి నాయకులు బుద్ధభవన్ వద్ద ఆందోళన చేపట్టారు. ‘బండి సంజయ్ వ్యాఖ్యలు సిగ్గుచేటు’, ‘అది నోరా.. మోరా?’, ‘ బండి సంజయ్ నీ నోటిని ఫినాయిల్తో కడుక్కో..’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్నవారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మహిళలు బండి సంజయ్కి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారని తెలిసిన వెంటనే బీజేపీ మహిళామోర్చా నాయకులు అక్కడికి చేరుకొని అతనికి సంఘీభావంగా నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటంతో పోలీసులు ఇరువర్గాలను అక్కడ్నుంచి పంపించి వేశారు. విచారణ అనంతరం బీజేపీ మహిళామోర్చా నాయకురాలు, లీగల్ అడ్వయిజర్ అయిన ఓ మహిళ మీడియాపై దురుసుగా ప్రవర్తించారు. బండి సంజయ్ని మీడియా పలు ప్రశ్నలు అడుగుతున్న క్రమంలో ఆమె నోరు అదుపు తప్పారు. ‘మీకు నోళ్లు పెద్దగానే ఉన్నాయిగా.. ఇంకా గట్టిగా ఒర్లండి’ అంటూ వ్యాఖ్యలు చేయటంతో రిపోర్టర్లు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.