Puvvada Vasantha Lakshmi | ప్రతి మగాడి విజయం వెనుక మహిళ శక్తి ఉంటుందని అంటుంటారు. ఆ మాదిరిగానే రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విజయం వెనుక.. ఆయన సతీమణి వసంత లక్ష్మి కృషి ఎంతో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించి గులాబీ గెలుపునకు అన్ని విధాలా కృషి చేశారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ప్రచార బాధ్యతలను కూడా వసంత లక్ష్మి తన భుజాన వేసుకున్నారు. గడప గడపకు తిరిగి బీఆర్ఎస్ మేనిఫెస్టోను వివరిస్తున్నారు. మేనిఫెస్టోను కూడా అందిస్తున్నారు ఆమె.
ఈ సందర్భంగా వసంత లక్ష్మి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందన్నారు. ఖమ్మం ప్రజలు బీఆర్ఎస్ పార్టీని సాదరంగా ఆహ్వానిస్తున్నారని, తమ ఓటు కారుకే అని చెబుతున్నారని తెలిపారు. ఖమ్మం అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఎన్నో నిధులు ఖర్చు పెట్టిందని పేర్కొన్నారు. మంత్రి అజయ్ కుమార్ ఖమ్మం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, దాంతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. మంత్రి అజయ్ కుమార్ను ముచ్చటగా మూడోసారి గెలిపించేందుకు ఖమ్మం నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆమె స్పష్టం చేశారు. ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా తప్పకుండా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతుందన్నారు.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు, ఇంటింటికి మంచినీరు ఇవ్వడంతో మహిళలు ఎంతో సంతోషంగా ఉన్నారని వసంత లక్ష్మి తెలిపారు. ప్రస్తుతం ప్రజలంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారని చెప్పారు. తమ కుమారుడు డాక్టర్ పువ్వాడ నాయన్ రాజ్ వచ్చే సోమవారం నుంచి ప్రచారంలో పాల్గొంటారని ఆమె పేర్కొన్నారు.