కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలంలో దారుణం చోటుచేసుకున్నది. మండలంలోని రామకృష్ణకాలనీలో తల్లీకూతుళ్లపై దుండగులు కత్తితో దాడిచేశారు. దీంతో కూతురు మరణించగా, తల్లి తీవ్రంగా గాయపడింది. రామకృష్ణ కాలనీకి చెందిన బాలవ్వ, సులోచన తల్లీ కూతుళ్లు. గురువారం రాత్రి ఇద్దరు ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు వారిపై కత్తితో దాడికితెగబడ్డారు.
దీంతో తీవ్రంగా గాయపడిన సులోచన అక్కడికక్కడే మృతిచెందింది. రక్తపు మడుగులో పడిఉన్న బాలవ్వను గుర్తించిన స్థానికులు దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, దాడికి భూతగాదాలే కారణమని స్థానికులు భావిస్తున్నారు.