వానకాలం సీజన్కు సంబంధించిన పెట్టుబడి సాయం జూన్లో మొదలుపెట్టి ఆగస్టు వరకు పూర్తి చేయాలి. కేసీఆర్ ప్రభుత్వం గత వానకాలం రైతుబంధు పంపిణీ జూన్ 26న ప్రారంభించి ఆగస్టు 23నాటికి పూర్తి చేసింది. దీనికితోడు ఆగస్టు 15లోగా రూ.రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దేవుళ్ల మీద ఒట్లు పెడుతున్నారు. రుణమాఫీ కోసం సుమారు రూ.40 వేల కోట్లు అవసరమని అంచనా. ఈ విధంగా ఆగస్టులోగా రుణమాఫీ పూర్తి చేయడం, పెట్టుబడి సాయం అందించడం అనే లక్ష్యాలను చేరుకోవాలంటే ప్రభుత్వానికి దాదాపు రూ.52 వేల కోట్లు అవసరం. రానున్న రెండు నెలల్లో ప్రభుత్వానికి రూ.52 వేల కోట్ల ఆదాయం సమకూరడం అసాధ్యమని ఆర్థికరంగ నిపుణులు చెప్తున్నారు.
Rythu Bandhu | హైదరాబాద్, మే 8(నమస్తే తెలంగాణ): మరో నెలలో వానకాలం సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతుబంధు పంపిణీపై నీలినీడలు కమ్ముకున్నాయి. యాసంగి సీజన్ రైతుబంధు పంపిణీలో తీవ్ర జాప్యం చేసిన కాంగ్రెస్ సర్కార్.. వానకాలం సీజన్లోనైనా సక్రమంగా ఇస్తుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వానకాలం సీజన్కు రైతుబంధు కింద పాత పది వేలు ఇస్తుందా? రైతుభరోసా కింద రూ.15 వేలు ఇస్తుందా? అనేది తేలాల్సి ఉన్నది. వానకాలంలో అందరికీ ఇస్తుందా? కొందరికే పరిమితం చేస్తుందా? ఎన్ని ఎకరాలు దాటినవారికి ఎగనామం పెడుతుంది? అనే అంశంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నది. రైతుభరోసా నిబంధనల్లో మార్పులు, నిధులు సమకూర్చడం వంటి అంశాలు పెట్టుబడి సాయం పంపిణీపై ప్రభావం చూపనున్నాయి. దీంతో వానకాలం సీజన్కు పెట్టుబడి సాయం అందించడంలో జాప్యం జరిగే అవకాశం ఉన్నదని వ్యవసాయ శాఖ వర్గాలు సంకేతాలిస్తున్నాయి. వానకాలం పెట్టుబడి సాయాన్ని కూడా యాసంగి సీజన్లో మాదిరిగానే పంట వేసే సమయంలో కాకుండా పంట కోతలు పూర్తయ్యాక జమ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్తున్నాయి.
కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు కింద ఏడాదికి ఎకరాకు రూ.పది వేలు అందజేయగా, కాంగ్రెస్ మాత్రం రైతుభరోసా పేరిట ఎకరాకు రూ.15 వేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చింది. ప్రస్తుత యాసంగి సీజన్కు మాత్రం గతంలో మాదిరిగా రైతుబంధు కింద ఎకరాకు రూ.5 వేలు అందజేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటే, వానకాలం సీజన్ నుంచి రైతుభరోసా పేరిట ఏడాదికి ఎకరాకు రూ.15 వేల చొప్పున అందరికీ పెట్టుబడి సాయం అందజేయాల్సి ఉంటుంది. అంటే కారుకు రూ.7,500. అయితే, పంట సాగు చేసే భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందజేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితోపాటు వ్యవసాయ మంత్రి తుమ్మల, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని స్పష్టంగానే చెప్తున్నారు.
రైతుభరోసాపై అసెంబ్లీలో చర్చ పెడతామని, ఆ తర్వాతే అమలుచేస్తామని పలు సందర్భాల్లో సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో చర్చించేదెప్పుడు? నిబంధనల్లో మార్పులు చేసేదెప్పుడు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. జూన్లో తొలకరి చినుకులు పలకరించగానే రైతులు వ్యవసాయ పనులు మొదలుపెడతారు. జూలై, ఆగస్టు మాసాల్లో విత్తనాలు చల్లడం, నాట్లు వేయడం లాంటి పనులు ముమ్మరంగా సాగుతుంటాయి. ఆలోగా పెట్టుబడి సాయం అందజేస్తేనే అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సిన దుస్థితి రైతులకు తప్పుతుంది. అందుకే కేసీఆర్ ప్రభుత్వం ఇతర చెల్లింపులు ఆపి అయినా సరే, రైతులకు సకాలంలో పెట్టుబడి సాయం అందజేసింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అంత కమిట్మెంట్ చూపిస్తుందా? అన్న సందేహాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి.
రైతుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఎంతో చిత్తశుద్ధి, నిబద్ధత ఉంటే తప్ప రైతుబంధు లేదా రైతుభరోసా పథకాలకు సకాలంలో నిధులు సమకూర్చడం సాధ్యం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు అందరికీ రైతుభరోసాను అమలు చేయాలంటే యాసంగి లెక్కల ప్రకారం 1.53 కోట్ల ఎకరాలకుగాను రూ.11,475 కోట్లు సమకూర్చాల్సి ఉంటుంది. ఈ లెక్కన యాసంగిలో ఇచ్చిన దానికంటే అదనంగా రూ.4,095 కోట్లు సిద్ధం చేయాలి. యాసంగి సీజన్లో ఐదారు నెలలు సమయం తీసుకొని కూడా రూ.7,625 కోట్లు ఇవ్వడానికే కిందా మీదా పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం.. రాబోయే రెండు మూడు నెలల్లో రూ.11,475 కోట్లు సర్దుబాటు చేయగలదా? అన్నది ప్రశ్న. దీనికితోడు రైతుభరోసాకు నిధులు ఇవ్వాలంటే బడ్జెట్లో కేటాయింపులు చేసి, అసెంబ్లీలో ఆమోదం పొందాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఈ ప్రక్రియ జూన్లో పూర్తయ్యే అవకాశం లేదు.
గత ప్రభుత్వం రాళ్లు, రప్పలకు కూడా రైతుబంధు ఇచ్చిందని, తమ ప్రభుత్వం పంట సాగు చేసే భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందిస్తుందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఇది అమలు కావాలంటే, ఏ రైతు ఎన్ని ఎకరాల్లో పంటలు సాగు చేశారో లెక్కించి, ఆ తర్వాత పెట్టుబడి సాయం అందించాల్సి ఉంటుంది. ఈ విధంగా క్షేత్రస్థాయిలో లెక్కలు వేసే ప్రహసనం ముగిశాకే పెట్టుబడి సాయం అందిస్తామంటే, ఇకపై సీజన్ ఆరంభంలోనే రైతులకు పెట్టుబడి సాయం అందడం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే జరిగితే రైతుబంధు ముఖ్య ఉద్దేశమే దెబ్బతినే ప్రమాదం ఉన్నది. రైతులకు సకాలంలో పెట్టుబడి సాయం అందజేయడం, ప్రైవేట్ వడ్డీల ఊబిలో చిక్కుకోకుండా రైతులను కాపాడుకోవడం, వ్యవసాయ ఉత్పత్తుల ఉత్పత్తి, ఉద్పాతకతలను పెంచడం రైతుబంధు పథకంలోని ముఖ్య ఉద్దేశాలు. ఇలాంటి సమోన్నత లక్ష్యాలేవీ లేని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు మూల సిద్ధాంతాన్నే దెబ్బతీసేవిధంగా వ్యవహరిస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పంటల సర్వే నిర్వహించి పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. అయితే 100% కచ్చితంగా పంటల సర్వే చేయడం సాధ్యమేనా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోసారి పంటల సాగు మొదలుపెడతారు. ఒక్కో రకమైన పంటను ఒక్కోసారి సాగు చేస్తారు. వానకాలం పంటల సాగు జూన్లో మొదలైతే సెప్టెంబర్ వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పంటల సర్వే ఎప్పు డు పూర్తి చేస్తారనేది ప్రశ్న. సెప్టెంబర్ వరకు పంటల సర్వేనే పూర్తికాకపోతే ఇక రైతులకు సాయం ఎప్పుడు అందిస్తారనేది మరో ప్రశ్న. ఇదే జరిగితే పంటల కోత పూర్తయిన తర్వాతే రైతులకు పెట్టుబడి సాయం అందుతుంది.