మిర్యాలగూడ : ముఖ్యమంత్రి కేసీఆర్ అపర భగీరథుడిలా కృష్ణా, గోదావరి జలాలను రైతు చెంతకు తీసుకువచ్చారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutta Sukhender Reddy) పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మిర్యాలగూడలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు . మున్సిపల్ శాఖకు చెందిన ఉత్తమ ఉద్యోగులను , పారిశుధ్య కార్మికులను సన్మానించి, ప్రసంశ పత్రాలను అందజేశారు.
ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యేది కాదని,ఇంతటి అభివృద్ధి జరిగేది కాదని అన్నారు. కేసీఆర్ పట్టుదల వల్లే కృష్ణా(Krishna) ,గోదావరి(Godavari water) జలాలు మన ఇంటిలోకి , పొలాల్లోకి వస్తున్నాయన్నారు. కేసీఆర్ నాయకత్వం కావాలని యావత్ దేశ ప్రజలు కోరుతున్నారన్నారు. మంత్రి కేటీఆర్(Minister KTR) కృషితో తెలంగాణలోని అన్ని నగరాలు,పట్టణాలు గొప్పగా అభివృద్ధి చెందాయని ప్రశంసించారు.
పట్టణాలలో మౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని దశల వారీగా చేపట్టిందన్నారు. ఇందుకోసం నూతన మున్సిపల్ చట్టాన్ని పటిష్టంగా రూపొందించి అమలుచేస్తుందన్నారు. మున్సిపాలిటీలకు ప్రతీ నెలా నిధులు విడుదల చేస్తున్నదని చెప్పారు. పచ్చదనం అభివృద్ధి కోసం మున్సిపాలిటీల బడ్జెట్(Budget) ప్రణాళికలలో 10 శాతం గ్రీన్ బడ్జెట్ కింద కేటాయించారని చెప్పారు. అన్నారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ప్రభుత్వం వెజ్ – నాన్ వెజ్ సమీకృత మార్కెట్లను నిర్మిస్తున్నదని అన్నారు.
పేరుకుపోయిన లెగసీ వేస్ట్ ను బయో మైనింగ్ ద్వారా ఎరువుగా మార్చే ప్రక్రియ అమలవుతున్నదన్నారు.
ఈ మేరకు ఫిబ్రవరి 2020 నుంచి మార్చి 2021 వరకు ప్రభుత్వం ప్రతి నెలా మున్సిపాలిటీలకు రూ.70 కోట్లు, జీహెచ్ఎంసీకి రూ.78 కోట్లు పట్టణప్రగతి కార్యక్రమం కింద ప్రభుత్వం విడుదల చేస్తోందని వెల్లడించారు .
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ తిప్పన విజయసింహా రెడ్డి,మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, మున్సిపల్ కమిషనర్ రవీందర్ సాగర్, స్థానిక కౌన్సిలర్లు,మున్సిపల్ శాఖ అధికారులు, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.