కామారెడ్డి : 4.26 ఎకరాల స్థలంలో ఆటోనగర్ ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం బాన్సువాడ పట్టణ శివారులోని కొయ్యగుట్ట వద్ద నూతనంగా ఏర్పాటు చేయనున్న ‘బాన్సువాడ ఆటోనగర్’ కు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆటోనగర్ ఏర్పాటుతో 3,000 మందికి ఉపాధి దొరుకుతుందన్నారు.
మొత్తం 300 దుకాణాలు ఏర్పాటు చేయడానికి అనువుగా రూ. 4 కోట్లతో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పటికే భూసేకరణకు సంబంధించిన రూ. 3 కోట్లను రైతులకు చెల్లించామని స్పష్టం చేశారు. యువకులకు ఉపాధి కలిపించడానికి ప్రభుత్వం అనేక పథకాలను చేపడుతుందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో గత 8 ఏండ్లలో IT రంగంలో 6 లక్షల ఉద్యోగాలు, పరిశ్రమల రంగంలో 16 లక్షల ఉద్యోగాలు వచ్చాయన్నారు. మంత్రి కేటీఆర్ నాయకత్వంలో పారిశ్రామిక రంగం దూసుకెళుతుందని పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్ నుంచి మెదక్ వరకు జాతీయ రహదారి పూర్తయింది.
ఎల్లారెడ్డి నుంచి బాన్సువాడ మీదుగా రుద్రూరు వరకు త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయని పోచారం తెలిపారు. కార్యక్రమంలో TSIIC ఎండీ నరసింహా రెడ్డి, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, నాయకులు పోచారం సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.