మహబూబాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో జిల్లాలోని డోర్నకల్ మండలం చివరి ఆయకట్టు వరకు రెండు పంటలకు సాగు నీరందుతుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. డోర్నకల్ మండల కేంద్రంలోని మున్నేరువాగు పై నిర్మిస్తున్న సీతారామ ఎత్తిపోతల కెనాల్ బ్రిడ్జి పనులను ఆమె అధికారులతో కలిసి పరిశీలించారు.
ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతానికి సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని అందించి రైతులను అభివృద్ధి చేయడానికి సీఎం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. డోర్నకల్ కు రెండు పంటలకు నీరందడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని వెల్లడించారు. గోదావరి- కృష్ణా (పాలేరు) నదుల అనుసంధానంలో 14,15వ ప్యాకేజీ పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఆమె అన్నారు.
2003లో చంద్రబాబు హయంలో ఒక్కరోజు నీరొచ్చి 20 ఏళ్లు కన్నీరు మిగిలిందని ఆరోపించారు .ఈ ప్రాంతంలో మిర్చి లిపిడ్ ప్లాంటు ఏర్పాటుకు కృషి చేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శశాంక, సీఈ శంకర్ నాయక్, డీఈ రమేష్ రెడ్డి, ఈఈ వెంకటాచార్యులు, తహసీల్దార్ స్వాతి బిందు, టీఆర్ఎస్ నాయకులు తాళ్లూరి హనుమ మల్లం అనిల్, మైను పాషా, తాళ్లూరి రామయ్య తదితరులు పాల్గొన్నారు.