సాధారణంగా పత్తిని ఏడాదికి ఒక పంటగా.. అదీ వానకాలంలో వర్షాధార పంటగా మాత్రమే సాగు చేస్తుంటారు. కానీ, నల్లగొండ జిల్లా పెద్దవూర మండలానికి చెందిన రైతులు యాసంగిలోనూ ప్రయోగాత్మకంగా పత్తి పంట వేసి.. ఎకరానికి 7 నుంచి 9 క్వింటాళ్ల పత్తిని పండిం చి.. రెండింతల ఆదాయం పొందుతున్నారు. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్తుతోనే సాధ్యమైందని కర్షకులు తేల్చి చెప్తున్నారు. వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన ‘రైతు బంధు’వు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
Cotton | పెద్దవూర, మే 6: స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు, ప్రవేశ పెట్టిన పథకాలతో వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి అవకాశం ఉన్న ప్రతి ఎకరాకూ ప్రభుత్వం నీటి వసతి కల్పిస్తున్నది. అవకాశం లేని చోట మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల్లో పూడిక తీసి భూగర్భ జలాలను పెంచింది. తద్వారా పుష్కలంగా నీరు అందుబాటులోకి వచ్చింది. దీనికితోడు 24 గంటల ఉచిత విద్యుత్తు అన్నదాతకు వెన్నుదన్నుగా నిలుస్తున్నది. ఫలితంగా రైతులు యాసంగి సీజన్లోనూ కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుడుతున్నారు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలోని బట్టుగూడెం, పెద్దవూర, పెద్దగూడెం, గర్నెకుంట, సంగారం గ్రామాల్లో వంద ఎకరాల్లో రైతులు బోర్లు, బావుల కింద యాసంగిలోనూ పత్తి పంటను సాగు చేశారు. కొందరు జొన్న, సజ్జ, రాగులు, పెసర, ఆముదం పంటలు పండిస్తున్నారు. రైతులకు ఏడాదికి రెండు పంటలు చేతికొస్తున్నాయి. ఈ ఏడాది వానకాలం సీజన్లో చాలా వరకు పత్తి పంటకు నష్టం వాటిల్లింది. ఆ నష్టాన్ని యాసంగి పూడుస్తున్నది. ఇప్పటికే ఎకరానికి 7 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని, మరో రెండు క్వింటాళ్ల వరకు పంట వచ్చే అవకాశముందని రైతులు చెప్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే రైతుబంధుతో కలిపి పెట్టుబడి ఖర్చులు పోనూ ఎకరానికి రూ.40 వేల నుంచి రూ.45 వేల వరకు మిగులుతున్నదని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రెంటచింతల. బతుకుదెరువు కోసం 15 ఏండ్ల క్రితం పెద్దవూర మండలానికి వచ్చిన. 10 నుంచి 15 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి, మిరప సాగు చేస్తున్నా. ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తుండటంతో డ్రిప్ వేసి 3 ఎకరాల్లో పత్తి సాగు చేసిన. పంట బాగుంది. ఇప్పటి వరకు ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి తీసిన. ఇంకో రెండు క్వింటాళ్ల వరకు వస్తుంది. పెట్టుబడిపోను ఎకరానికి రూ.40 వేల నుంచి రూ.45 వేల వరకు మిగిలాయి. -నలావత్ శ్రీనునాయక్, రైతు, పెద్దవూర
24 గంటల విద్యుత్తుతోనే యాసంగిలో పత్తి సాగు సాధ్యమైంది. పదేండ్ల కిందట వాగులు, చెరువుల్లో నీళ్లు లేక వాన మీదనే ఆధారపడి పంటలు వేస్తే చాలా నష్టం వచ్చేది. ఇప్పుడు వాగులు, చెరువుల్లో ఎక్కడ చూసినా నీళ్లే. వాగు నుంచి మా భూమిలోకి పైపులైన్ వేసి యాసంగిలో కూడా పంటలు పండిస్తున్నాం. 24 గంటల ఉచిత విద్యుత్ మాకు వరంగా మారింది. ఈ యాసంగిలో ఐదెకరాల్లో పత్తి వేశాను. ఇంకో 20 రోజుల్లో పంట చేతికొస్తుంది.
-లింగారెడ్డి, బట్టుగూడెం (పెద్దవూర)