నందిపేట్, జూన్ 6: నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం సీహెచ్ కొండూర్లో శ్రీరాజ్యలక్ష్మీ సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి నూతన ఆలయ ప్రతిష్ఠాపనోత్సవాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. మూడో రోజైన సోమవారంఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కుటుంబీకులు 4,400 లీటర్ల ఆవు పాలతో ప్రతిష్ఠాపన విగ్రహాలకు అభిషేకం చేశారు. ఉదయం ప్రాతఃకాల ఆరాధన వేదవిన్నపాలతో కార్యక్రమాలు మొదలయ్యాయి. జలాధివాసం లోప్రతిష్ఠాపన మూర్తులకు క్షీరాధివాసం చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత-అనిల్కుమార్, దేవనపల్లి నవలత-రాంకిషన్రావు, అరుణ్- ననిత దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నివేదన, మంగళాశాసనం, శాత్తుమోరె, ద్వారాతోరణం, ధ్వజకుంభారాధన, చతుస్థానార్చన, అగ్నిముఖం, మంత్రహవనం, మృత్తికావిన్నపం, నయన ఉన్మీలనం, పంచసూక్త పరివార ప్రాయశ్చిత్త హవనం, తీర్థప్రసాద గోష్టితో పూజలు ముగిశాయి. రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి, విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి, ఎమ్మెల్సీ రఘోత్తమ్రావు, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, కలెక్టర్ నారాయణరెడ్డి దంపతులు పాల్గొన్నారు.