మహబూబాబాద్ రూరల్, జూలై 18: ‘డబ్బులు ఎలుకల పాలయ్యాయని బాధపడకు.. నీకు నేనున్నా.. వైద్యం చేపిస్తా’ అంటూ మహబూబాబాద్ జిల్లా ఇందిరానగర్ తండాకు చెందిన భూక్యా రెడ్యాకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ భరోసా ఇచ్చారు. వైద్య ఖర్చుల కోసం బీరువాలో దాచుకున్న రూ.2 లక్షలను ఎలుకలు కొరికివేశాయన్న బాధలో ఉన్న రెడ్యాకు ఆదివారం మంత్రి ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. కడుపులోని కణతి ఆపరేషన్ చేయించుకునేందుకు కోరుకున్న చోట వైద్యం చేయిస్తానని, నష్టపోయిన డబ్బులు కూడా వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. బాధితుడు రెడ్యా ఇంటికి వెళ్లి విచారణ చేయాలని తాసిల్దార్ రంజిత్కుమార్ను ఆదేశించారు. మంత్రి మాటలతో రెడ్యా ఆనందం వ్యక్తం చేశారు.