యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం ద్వారా పాలమూరు, నల్లగొండ జిల్లాలను ఎండబెట్టాలనుకుంటున్నారా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రాజెక్టుల అప్పగింతపై అఖిలపక్ష సమావేశం ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో సోమవారం మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బీఆర్ఎస్ ఆలేరు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ కుతంత్రాలతో సాగునీటితోపాటు విద్యుత్తు సమస్య కూడా ఉత్పన్నతమవుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. 811 టీఎంసీల్లో 50% తెలంగాణకు దక్కాల్సిందేనని డిమాండ్ చేశారు. రేవంత్రెడ్డి సీఎం అనే విషయాన్ని మర్చిపోయి, ఇంకా పీసీసీ అధ్యక్షుడిగానే వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ను బొందపెట్టే వ్యక్తి లేడని, ఇకపై పుట్టబోడని, రానున్న రోజుల్లో ప్రజలే కాంగ్రెస్ను బొందపెట్టబోతున్నారని చెప్పారు. సమావేశంలో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, ఎన్డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకులు సుదగాని హరిశంకర్గౌడ్, తుంగ బాలు తదితరులు పాల్గొన్నారు.