తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రస్థానంలో దూసుకుపోతుంటే.. రాష్ట్ర ప్రగతిపై ప్రశంసలు కురిపిస్తూ కాలం వెళ్లదీయడం తప్ప.. కేంద్రం ఒక్క పైసా ఇవ్వటం లేదు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రం పదే పదే అడ్డుతగులుతున్నది. కేంద్ర ప్రభుత్వం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు స్వేచ్ఛగా పనిచేయకుండా, సర్వీసు రూల్స్ను సవరించి రాష్ర్టాల హక్కులను హరించే ప్రయత్నాలు చేస్తున్నది. సివిల్ సర్వీసెస్ అధికారాలను పూర్తిగా కేంద్రీకృతం చేస్తున్నది. –మంత్రి కొప్పుల నేతృత్వంలో తనను ప్రగతిభవన్లో కలిసిన పలువురు నేతలతో మంత్రి కేటీఆర్
మేడ్చల్, జనవరి 25 : ‘భారతదేశాన్ని సాకుతున్న రాష్ర్టాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉన్నది. కానీ హైదరాబాద్ అభివృద్ధికి రూ.7,800 కోట్ల నిధులు ఇవ్వాలని ఎన్ని లేఖలు రాసినప్పటికీ కేంద్రం స్పందించడం లేదు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనైనా తెలంగాణకు నిధులు కేటాయించకుంటే కేంద్రంలోని బీజేపీ తీరును ప్రజల్లో ఎండగడతాం’ అని రాష్ట్ర పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్.. రూ.499.96 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గుజరాత్ రాష్ట్రంలో వరదలు వస్తే ప్రధాని మోదీ వెయ్యి కోట్లు కేటాయించారని, హైదరాబాద్లో వరదలు వస్తే మాత్రం చిల్లిగవ్వ ఇవ్వలేదని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఉన్న కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బీజేపీ ఎంపీలకు ఢిల్లీలో కనీసం మాట్లాడే పరిస్థితిలేదని ఎద్దేవాచేశారు. దేశాన్ని సాకుతున్న రాష్ర్టాల్లో హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉన్న విషయాన్ని సాక్షాత్తూ భారత రిజర్వు బ్యాంకు ప్రకటించిందని కేటీఆర్ గుర్తుచేశారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దితే సంపద పెరిగి.. కేంద్ర ప్రభుత్వానికి మరిన్ని ఆర్థిక వనరులు సమకూరుతాయని తెలిపారు. హైదరాబాద్ ఎంత అభివృద్ధి చెందితే అంత సంపద పెరుగుతుందని.. తద్వారా వచ్చిన ఆదాయంతో నిరుపేదల అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే అవకాశం కలుగుతుందని చెప్పారు. రాష్ట్రానికి నిధుల కేటాయింపులో కేంద్రం వివక్ష చూపితే రాజీపడే ప్రసక్తే లేదని కేటీఆర్ తేల్చిచెప్పారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తారని తెలిపారు.
స్కైవేలకు కేంద్రమే అడ్డు
హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా నాలాల ఆధునీకరణ, స్కైవేల నిర్మాణాలు, చెరువుల అభివృద్ధికి నిధులు మంజూరుచేయాలని కేంద్రానికి రాసిన లేఖలో కోరినట్లు కేటీఆర్ తెలిపారు. కంటోన్మెంట్ ప్రాంతంలో వంద ఎకరాల స్థలం ఇస్తే స్కైవేలు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పారు. ప్యారడైజ్ చౌరస్తా నుంచి కండ్లకోయ ఔటర్రింగ్ రోడ్డు, జూబ్లీ నుంచి శామీర్పేట్ ఔటర్రింగ్రోడ్డు వరకు ఎక్స్ప్రెస్ స్కైవేలు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధంచేసినట్లు వివరించారు. కేంద్రం సహకరించక పోయినప్పటికీ బాలానగర్ చౌరస్తా నుంచి సుచిత్ర వరకు రూ.500 కోట్లతో స్కైవే నిర్మించేందుకు చర్యలు తీసుకొంటున్నట్టు పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో లక్ష ఇండ్ల స్థలాల పట్టాలు లబ్ధిదారులకు అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. అవసరమైతే నిరుపేదలకు ఇండ్ల స్థలాల పట్టాలు అందించేందుకు 58, 59 జీవోలను మళ్లీ అందుబాటులోకి తెస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. సమావేశంలో మంత్రులు మల్లారెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీలు ఎస్ వాణీదేవి, శంభీపూర్రాజు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ దానకిశోర్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో వసుధైక కుటుంబం: మంత్రి కేటీఆర్
హైదరాబాద్, జనవరి 25 : రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రస్థానంలో దూసుకుపోతున్నా కేంద్రం ఒక్క పైసా ఇవ్వదని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రగతిపై ప్రశంసలు కురిపిస్తూ కాలం వెళ్లదీయడం తప్ప ఒక్క పైసా ఇవ్వదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రం పదే పదే అడ్డుతగులుతున్నదని విమర్శించారు. ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ నేతృత్వంలో పలువురు నేతలు మంగళవారం ప్రగతిభవన్లో మంత్రి కేటీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు స్వేచ్ఛగా పనిచేయకుండా, సర్వీసు రూల్స్ను సవరించి రాష్ర్టాల హక్కులను హరించే ప్రయత్నాలు చేస్తున్నదని విమర్శించారు. దేశంలో తెలంగాణ గొప్ప లౌకిక రాష్ట్రమని, ఈ విషయంలో ఇతర రాష్ర్టాలు, యావత్ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నదని అన్నారు. సీఎం కేసీఆర్ స్వధర్మాన్ని పాటిస్తున్నా, యజ్ఞ, యాగాలు చేస్తున్నా, యాదాద్రి ఆలయాన్ని గొప్పగా నిర్మిస్తున్నా, అన్ని కులాలు, మతాలు వర్గాల పట్ల వివక్ష కనబరచకుండా సమదృష్టితో ముందుకు సాగుతున్నారని కొనియాడారు. తెలంగాణలో వసుధైక కుటుంబం నెలకొన్నదనడంలో అతిశయోక్తి లేదన్నారు. కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్తోపాటు ఎమ్మెల్యేలు డాక్టర్ టీ రాజయ్య, స్టీఫెన్సన్, డీ రాజేశ్వర్రావు, ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, ఫుడ్ కమిషన్ సభ్యుడు ఆనంద్, క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ కాంతివెస్లీ పాల్గొన్నారు.