రామచంద్రాపురం, ఆగస్టు 13: నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో త్వరలో నిర్మించనున్న ప్రభుత్వ పాఠశాలకు కావాల్సిన స్థలాన్ని గురువారం ఆయన పరిశీలించారు. తెల్లాపూర్లో కేజీ నుంచి ఇంటర్ వరకు చదువుకునే విధంగా రూ.48 కోట్లతో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో వివిధశాఖల అధికారులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి తెల్లాపూర్లోని గద్దర్ విగ్రహం వెనుకాల సర్వే నంబర్ 323లో స్థల పరిశీలన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా తెల్లాపూర్లో రూ.48 కోట్లతో అత్యాధునిక ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అత్యుత్తమ విద్యను అందించాలన్నదే తమ లక్ష్యమన్నారు. ప్రతి విద్యార్థికి సమానమైన, నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థుల సమగ్ర వికాసానికి అవసరమైన అన్ని సౌకర్యాలు పాఠశాలలో ఏర్పాటు చేస్తామన్నారు. ఈనెల 17వ తేదీన పాఠశాల నిర్మాణానికి భూమిపూజ చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీసీ జ్యోతిరెడ్డి, సర్వేయర్ రాంభద్ర, బీఆర్ఎస్ నాయకులు సోమిరెడ్డి, దేవేందర్ యాదవ్, శ్రీశైలం, ఉమేశ్, దయాకర్రెడ్డి, సాగర్, నాగరాజు, రవీందర్రెడ్డి, చెన్నారెడ్డి, కొమురయ్య, మోహన్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.