కొత్తగూడెం టౌన్, ఆగస్టు 13 : ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. సుజాతనగర్ మండలం సింగభూపాలెం, వేపలగడ్డ గ్రామాల్లో గురువారం విస్తృతంగా పర్యటించిన కలెక్టర్.. వివిధ అభివృద్ధి, సంక్షేమ, విద్యా కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సింగభూపాలెం చెరువును సందర్శించి, నీటి నిల్వ పరిస్థితులను పరిశీలించారు. ప్రస్తుతానికి 14.5 అడుగుల నీటిమట్టం ఉన్నదని, సుమారు 2,200 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని తెలిపారు. వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ, ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని చెప్పారు. అనంతరం పాత అంజనాపురంలో రైతులు సాగు చేస్తున్న కూరగాయలు, పెసర, పత్తి పంటలను కలెక్టర్ పరిశీలించారు.
కాకర, సొరకాయ తదితర కూరగాయల సాగును పరిశీలించి రైతులతో నేరుగా మాట్లాడారు. సింగభూపాలెం గ్రామంలో సుమారు 600 ఎకరాల్లో కూరగాయలు, 300 ఎకరాల్లో పెసర సాగు జరుగుతున్నట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. ఈ విస్తీర్ణాన్ని మరింత పెంచేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో అందుబాటులో ఉన్న నీటి వనరుల దృష్ట్యా తాగునీటికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, ఉన్న నీటిని పొదుపుగా వినియోగించాలని సూచించారు. సింగభూపాలెంలో మొదటి దశలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులతోపాటు రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం చేపడుతున్న సర్వేను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయాధికారి బాబూరావు, ఉద్యానవన శాఖ అధికారి కిశోర్బాబు, తహసీల్దార్ కృష్ణప్రసాద్, వ్యవసాయ శాఖ ఏవోలు, నీటిపారుదల, సంబంధిత శాఖల అధికారులు, సర్వే బృందాల సిబ్బంది ఉన్నారు.