కరీంనగర్: గ్రామీణ క్రీడాకారులు జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా గ్రామీణ క్రీడా ప్రాంగణాలను నిర్మిస్తున్నామని క్రీడలు, యువజన సర్వీసులు, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కరీంనగర్లో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. శుక్రవారం కరీంనగర్ లో నిర్మించిన 400 మీటర్ల సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ ను, 100 మీటర్ల పరుగుపందెం, షార్ట్ ఫుట్ క్రీడలను మంత్రి ప్రారంభించారు.
ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతినియోజక వర్గంలో ఒక ఇండోర్ స్టేడియం నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, ఇప్పటి వరకు 45 స్టేడియంల నిర్మాణాలను పూర్తిచేసుకున్నామని వివరించారు. క్రీడలతో పాటు విద్యకు ప్రాధాన్యం ఇచ్చి దేశానికి మేధావులను అందించేలా వెయ్యి గురుకులాలను ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, తరువాత జరిగిన అభివృద్ధిని గమనించాలని జిల్లా ప్రజలకు సూచించారు. సమైక్య పాలనలో నిరుద్యోగుల జీవితాలతో చెలగాట మాడరని అన్నారు.
దేశ,విదేశాలకు ధీటుగా పర్యాటక శోభను సంతరించుకునేలా మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణం చేపట్టారని పేర్కొన్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ స్వయం పాలనలో విద్య, వైద్యంతో పాటు క్రీడా రంగాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు.
కరీంనగర్లో రీజనల్ స్పోర్ట్స్ స్కూల్లో ఏర్పాటు చేసిన సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ తెలంగాణలోనే నాలుగవదని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి , నగర మేయర్ వై సునీల్ రావు, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.