Minister KTR | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 28 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరం యావత్ భారతదేశానికే ఎకనమిక్ గ్రోత్ ఇంజిన్గా మారిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా వివక్ష చూపుతూ మోకాలడ్డుతున్నా తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం అభివృద్ధిలో వెనుకడుగు వేయకుండా ముందుకు సాగేలా చర్యలు చేపడుతున్నామని స్పష్టంచేశారు. ఆర్థికాభివృద్ధిలో దేశానికి మార్గదర్శకంగా మారిన హైదరాబాద్ను కేంద్రం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.
హైదరాబాద్ అభివృద్ధి దేశానికే మంచిదని పేర్కొన్నారు. ‘తెలంగాణ అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందినట్టు కాదా? దేశ సంపదలో హైదరాబాద్ సంపద లేదా?’ అని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి తొమ్మిదేండ్లలో కేంద్రానికి రూ.3.68 లక్షల కోట్లు పన్ను ల రూపంలో పంపితే, తిరిగి రాష్ర్టానికి రూ.1.68 లక్షల కోట్లు మాత్రమే కేటాయించిందని తెలిపారు. మన డబ్బులు ఇతర ప్రాంతాల అభివృద్ధికి వాడుకొని, మనకు మొండిచేయ్యి చూపుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఆర్థికాభివృద్ధి, రాజకీయాలు వేరన్న విషయం కేంద్రం పెద్దలు గ్రహించాలని హిత వు పలికారు.
మంగళవారం హైదరాబాద్లోని ఖాజాగూడ పెద్ద చెరువు సుందరీకరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. 51 చెరువుల అభివృద్ధి, సుందరీకరణకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బిలిటీ (సీఎస్ఆర్) కింద ముందుకొచ్చిన సంస్థలకు ఎంవోయూ పత్రాలను అందజేశారు. సీఎస్ఆర్ కింద జీహెచ్ఎంసీ పరిధిలో 26, హెచ్ఎండీఏ పరిధిలో 25 చెరువులను సుందరీకరించనున్నారు. నగరవాసులు కుటుంబ సమేతంగా సేద తీరేందుకు అనువుగా చెరువులను తీర్చిదిద్దుతున్నట్టు కేటీఆర్ చెప్పారు. చెరువుల చుట్టూ నడక దారి, సేద తీరడానికి కుర్చీల ఏర్పాటు, వ్యాయామ శాల, ఆట స్థలం, థీమ్ పారు, టాయిలెట్స్, లైటింగ్, సెక్యూరిటీ గార్డ్ వంటి సౌకర్యాలు కల్పించనున్నట్టు వెల్లడించారు.
హైదరాబాద్లో 250 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణకు చర్యలు తీసుకొంటున్నట్టు మంత్రి కేటీఆర్ చెప్పారు. లక్డీకాపూల్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రో విస్తరణ చేపట్టేందుకు సహకరించాలని కేంద్రాన్ని కోరగా ఫీజిబులిటీ లేదని కేంద్రం చెప్పిందని, కేంద్రం నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం మెట్రో విస్తరణ చేపడుతుందని స్పష్టంచేశారు. రెండు మూడేండ్లలో శంషాబాద్ ఎయిర్పోర్టు మెట్రో లైన్ను పూర్తి చేస్తామని తెలిపారు.
నగరంలో ప్రజా రవాణా కోసం 500 ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడుతున్నామని, భవిష్యత్తులో వంద శాతం ఎలక్ట్రిక్ బస్సులు నడపడానికి చర్యలు తీసుకొంటామని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరానికి అధునాతన సదుపాయాలు కల్పించడానికి రూ.2,400 కోట్లతో లింక్ రోడ్లు, రూ.10 వేల కోట్లతో మూసీ ఎక్స్ప్రెస్వే నిర్మాణానికి చర్యలు తీసుకొంటున్నట్టు వెల్లడించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచం అబ్బురపడేలా రాచకొండలో ఫిలిం సిటీతోపాటు ఒలింపిక్ స్థాయిలో స్పోర్ట్స్ సిటీని నిర్మిస్తామని వివరించారు.
ఎనిమిదేండ్లలో హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని, ఇంకా చేయాల్సింది చాలా ఉన్నదని మంత్రి కేటీఆర్ చెప్పారు. శాంతి భద్రతలు సక్రమంగా ఉన్నప్పుడు పెట్టుబడులు పెట్టేందుకు అన్ని సంస్థ లు ముందుకు వస్తాయని, దానికి దీర్ఘకాలిక ప్రణాళిక ఉన్నదని అన్నారు. ‘ప్రస్తుతం హైదరాబాద్ వ్యాక్సిన్ నగరంగా పేరుగాంచింది. హైదరాబాద్ నుంచి భవిష్యత్తులో ఏటా 1,400 కోట్ల వ్యాక్సిన్లను ఇతర దేశాలకు ఎగమతి చేస్తాం. ఐటీ రంగంలో నిరుడు నగరం లో రూ.1.50 లక్షల ఉద్యోగాలు లభించాయి. ఫార్మా సిటీ ప్రపంచంలోనే అతిపెద్దదిగా అవతరిస్తుంది.
మొన్ననే ఫాక్స్కాన్ చైర్మన్ హైదరాబాద్కు వచ్చి ఇది భారతదేశమేనా? అని సందేహం వ్యక్తంచేశారు. హైదరాబాద్ ఎంత గా అభివృద్ధి చెందిందో చెప్పడానికి ఆయన మాటలే నిదర్శనం’ అని పేర్కొన్నారు. 440 సంవత్సరాలకు పైబడిన చరిత్ర కలిగిన ఈ నగరానికి మూసీనది వరమని అన్నారు. చెరువుల సుందరీకరణ భవిష్యత్తు తరాలను దృష్టిలోపెట్టుకొని చేపట్టాలని మంత్రి కేటీఆర్ సూచించారు. సమావేశంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్రెడ్డి, ఆకుల లలిత, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, సండ్ర వెంకట వీరయ్య, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
చెరువులను దత్తత తీసుకోవటం చాలా మంచి కార్యక్రమం. ప్రభుత్వం ఈ పథకం ప్రకటించిన తర్వాత తీసుకున్న 50 చెరువుల్లో ఎక్కువ మంది క్రెడాయ్ బిల్డర్లే ఉన్నారు. చెరువుల అభివృద్ధికి సంబంధించిన డిజైన్లో కూడా మాకు ప్రాతినిథ్యం కల్పించాలి. చెరువులను అప్పగించే ముందు స్పష్టంగా డీమార్కేషన్ చేసి ఇస్తే వివాదాలు లేకుండా సకాలంలో సుందరీకరణ పనులు పూర్తి చేయగలుగుతాం.
– రామకృష్ణారావు, క్రెడాయ్ హైదరాబాద్ శాఖ అధ్యక్షుడు
చెరువుల అభివృద్ధి కార్యక్రమం చాలా గొప్పది. అందరి చూపు హైదరాబాద్ నగరం పైనే ఉన్నది. పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన నగరం. గత ఎనిమిదేండ్లలో హైదరాబాద్ను అభివృద్ధి చేయడమే కాకుండా సురక్షితమైన నగరంగా చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు.
– సునీల్ చంద్రారెడ్డి, నరెడ్కో తెలంగాణ అధ్యక్షుడు