EC | హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): ఎన్నికల కోడ్ ఉల్లంఘనలో కాంగ్రెస్, ఆ పార్టీ నేతలపై తాము చేసే ఫిర్యాదులపై స్పందన ఉండటం లేదని బీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. మార్చి 16న ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్, టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ దాదాపు 25 ఫిర్యాదులు చేసినా ఈసీ నుంచి స్పందన లేదని విమర్శిస్తున్నాయి.
సభల్లో సీఎం రేవంత్ రైతు రుణమాఫీ అంశంలో దేవుళ్లపై ప్రమాణం చేస్తూ ఓటర్లను మభ్యపెడుతున్నారని, కేసీఆర్, కేటీఆర్పై అభ్యంతరకర వ్యాఖ్యాలు చేస్తు న్నారని, రాహుల్గాంధీ, మంత్రులు కొండా సురేఖ, ఉత్తమ్కుమార్రెడ్డి మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యలపైనా కంప్లయింట్ చేసినట్టు వివరించారు. ఇలా 45 రోజులుగా ఫిర్యాదుల చేస్తున్నా ఈసీ నుంచి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని పార్టీల పట్ల ఈసీ ఒకే తీరుగా వ్యవహరించాల్సి ఉ న్నా, అలా ఉండటం లేదని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నదనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.