PV Narasimha Rao | ప్రధానిగా దేశానికి నూతన దిశా నిర్దేశం చేసి, కాంగ్రెస్ పార్టీకి చిరకీర్తిని కట్టబెట్టిన పీవీ నరసింహారావు పేరెత్తడానికే ఆ పార్టీ నేతలకు భయం! ఢిల్లీకి రాజైన మన తెలంగాణ ముద్దుబిడ్డ పేరు తలచుకోవడానికీ ఇష్టపడరు. ప్రపంచం కొనియాడిన ఈ రాజనీతిజ్ఞుడు, దార్శనికుడి పేరు ఉచ్చరిస్తే ‘అధిష్ఠానం’ కన్నెర్ర చేస్తుందనే అనుమానం. ఇందిర, రాజీవ్ పేర్లను చెప్పుకొని తిరిగే హస్తం నేతలు తెలంగాణ ఠీవి.. పీవీని ఎందుకు విస్మరిస్తున్నారు? సంగీతం, సాహిత్యం, రాజకీయాల్లో పీవీకి వారసురాలైన సురభి వాణీ దేవి ఆవేదన వింటే.. అర్థమవుతుంది.
తండ్రిగా పీవీ ఎలా ఉండేవారు?
మాకు తెలిసిన నాన్న ఎప్పుడూ ప్రజా జీవితంలోనే ఉన్నారు. ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి, ఎంపీ, ప్రధానమంత్రిగానే నాన్నను చూశాను. నాన్న ఎంత బిజీగా ఉన్నా కుటుంబ బాధ్యతలు పక్కన పెట్టలేదు. ఆయనకు ఎనిమిది మంది సంతానం. కుటుంబానికి ఎంత సమయం కేటాయించాలో అంత కేటాయించారు.
ముందున్నోడిదే గ్రూప్.. నోరున్నోడిదే రాజ్యంలా ఉండే కాంగ్రెస్లో పీవీ ఎలా నెగ్గుకొచ్చారు?
అప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో నాన్న ముఖ్యమంత్రి అయ్యారు. 1969లో తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమాన్ని చల్లార్చేందుకు తెలంగాణ ప్రాంతం వాడైన నాన్న వాళ్లకు అక్కరకొచ్చారు. ముఖ్యమంత్రిని చేశారు. ఆయన మీద అభిమానంతో ఆ పదవి ఇవ్వలేదు. ముఖ్యమంత్రిగా నాన్న మంచి పనులు చేస్తుంటే వాళ్లే అడ్డుపడ్డారు.
గ్రూపు రాజకీయాల కాంగ్రెస్లో పీవీ బలం ఏమిటి?
ప్రతిపక్షం కంటే స్వపక్షమే ఎక్కువగా విమర్శించడం కాంగ్రెస్ చరిత్ర. తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే భూ సంస్కరణల చట్టాలు చేశారు. దున్నేవాడికే భూమి ఉండాలని నాన్న కోరిక. ఆ చట్టంపై అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లోని భూస్వాములు వ్యతిరేకించారు. అయినా పట్టుపట్టి చట్టాన్ని ఆమోదం పొందేలా చేశారు. చర్చ సందర్భంలో వ్యతిరేకించేవాళ్లు బయటికి పోవచ్చు. బలపరిచేవాళ్లు అసెంబ్లీలో ఉండొచ్చని ధైర్యంగా ప్రకటించారు. ఆనాటి భూస్వాములంతా కలిసి నాన్నకు వ్యతిరేకంగా పావులు కదిపారు. అలాంటి రాజకీయాలకు ఆయన ఏనాడూ భయపడలేదు. కాంగ్రెస్లో గ్రూపిజం తెలిసిందే కదా! అవతలి వారికి ధనబలం, కండబలం ఏదైనా ఉండొచ్చు. నాన్నకు ఉన్న ఆయుధం ఒక్కటే. మేధోసంపత్తి. దానితోనే రాజకీయాల్లో రాణించారు. నాన్న విలువలకు ప్రాధాన్యం ఇచ్చారు. అవే నాన్నను కాపాడాయి.
ముఖ్యమంత్రి పదవి మధ్యలోనే పోయినందుకు పీవీ బాధపడ్డారా?
నాన్నకు వ్యతిరేకంగా గ్రూపు కట్టిన మంత్రులు రాజీనామా చేశారు. అయినా ఆయన భయపడలేదు. చివరికి సీఎం పదవి పోయేలా చేశారు. అప్పుడూ బాధపడలేదు. ‘పేదలు బాగుపడే చట్టం తెచ్చాను. నా జీవితంలో ఓ గొప్ప పని చేశాన’ని సంతోషించారు. నాన్నకు ఎవరో విమర్శిస్తారనే భయం ఉండేది కాదు. ఎవరి మెప్పు కోసమో పని చేయాలనే తాపత్రయం కనిపించదు. సాధారణంగా అధికారంలో ఉన్నవాళ్లను పడగొట్టే ప్రయత్నం విపక్షం చేస్తుంది. కానీ, కాంగ్రెసే వెనుక నుంచి పడగొట్టే ప్రయత్నాలు చేసింది. అదే కాంగ్రెస్లో ఉన్న సంస్కృతి!
పీవీని కాంగ్రెస్ గౌరవించలేదన్నది నిజమేనా?
ఈ దేశానికి ప్రధానమంత్రి పదవి చేపట్టడానికి కొద్ది రోజుల ముందు నాన్నకు అమెరికాలో ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. అప్పుడు నాన్న వయసు 71 సంవత్సరాలు. రాజీవ్ గాంధీ హత్యానంతరం నాన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయ్యారు. ప్రధానమంత్రిగా ఆయన్ను కాంగ్రెస్ ప్రతిపాదించింది. ‘దేశానికి సేవ చేయడానికి భగవంతుడు నాకు మళ్లీ పునర్జన్మ ప్రసాదించాడ’ని నాన్న సంతోషించారు. ప్రధానమంత్రిగా పదవి చేపట్టే నాటికి నిధులు లేక బంగారు నిల్వలు తాకట్టు పెట్టే పరిస్థితి. వ్యవస్థలో అనిశ్చితి ఉంది. 45 రోజులకు సరిపోయే ఫారెక్స్ నిల్వలు మాత్రమే ఉన్నాయి. అలాంటి గడ్డు పరిస్థితుల్లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వయోభారం, ఆరోగ్య సమస్యలను లెక్క చేయకుండా దేశం కోసం పనిచేశారు. ‘సేవియర్ ఆఫ్ ఇండియా’ అని ప్రశంసలందుకొన్నారు. కానీ, ఆ పదవి ముగిసిన తర్వాత పీవీని కాంగ్రెస్ పక్కన పెట్టింది. ఆయన కాలం చేసిన తర్వాత కూడా ఆ పార్టీ వైఖరి మారలేదు.
తెలంగాణ ఎన్నికల్లో ఇందిర, రాజీవ్ జపం చేస్తున్న కాంగ్రెస్ నేతలు పీవీని తలచుకోవట్లేదు .. ఎందుకు?
ఎవరికైనా చిన్న సాయం చేసినా కృతజ్ఞతా భావంతో ఉంటారు. కానీ.. కాంగ్రెస్ నేతలకు ఆ కృతజ్ఞత ఏ కోశానా లేదు. ఎనకట కాశీ పోయి వస్తే ఆశ్చర్యపోయే వారు. ఒకప్పుడు సోలాపూర్, భీవండి పోయి బతికారు. ఇప్పుడు ప్రతి ఊరి వాళ్లూ అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. పీవీ తెచ్చిన ఆర్థిక సంస్కరణలు, సరళీకృత ఆర్థిక విధానాల ఫలితమిది. దేశంలో అందరి జీవితాల్నీ పీవీ విధానాలు మార్చాయి. దేశానికి అంత మేలు చేసిన సంస్కరణల గురించి మాట్లాడితే ఆ పార్టీ ఇంకో పది కాలాలపాటు బతికేది. కానీ, వాళ్లు పీవీని తలచుకోరు. ఆ పార్టీ నాశనమైనా ఫర్వాలేదు. ఫలాన వాళ్ల పేరు స్మరించం, వాళ్లు చేసిన మంచి గుర్తుచేసుకోం అన్నట్లున్నారు. అది ఏం సంస్కృతో అర్థం కాదు?!
పీవీకి సన్నిహితులైన ప్రణబ్, మన్మోహన్ ఉన్నతమైన పదవుల్లో ఉన్నా తగిన గౌరవం ఎందుకు ఇవ్వలేదు?
వాళ్లు నాన్నగారికి సన్నిహితులే. మా కుటుంబంతో వాళ్లు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవారు. ఢిల్లీలో పుట్టిన రోజు, వర్ధంతికి మన్మోహన్ సింగ్ గారు వచ్చారు. ప్రధానిగా ఆయన చేయలేదు. రాష్ట్రపతిగా ప్రణబ్ కూడా ఏమీ చేయలేదు. ఎందుకు చేయలేదో తెలియదు, వాళ్లు చేద్దామనుకున్నా చేయనివ్వరు.
ఇంతకుముందు హైదరాబాద్లో పీవీ పేరు ఎక్కడా కనపడనందుకు బాధపడ్డారా?
తన బిడ్డలుగా మాకు ఆ బాధ ఉంది. గౌరవిస్తే సంతోషం ఎట్లా కలుగుతుందో.. విస్మరిస్తే బాధపడ్డాం. ఇది మానవ నైజం. ఏం చేస్తాం. మంచిని సన్మానించడం తెలియని పార్టీ కాంగ్రెస్. ఒకప్పుడే ఆ బాధ. ఇప్పుడు లేదు. పీవీ శత జయంతి ఉత్సవాలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఘనంగా నిర్వహించారు. ఏడాది పాటు ఆ వేడుకలు జరిగాయి. సెక్రటేరియట్ దగ్గర పీవీ మార్గ్, పీవీ విగ్రహం ఏర్పాటు చేశారు. మా ఊళ్లో నాన్నగారి ఇల్లు ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఆ ఇంటిని మ్యూజియంగా మార్చింది. నాన్న పుట్టిన అమ్మమ్మగారి (నర్సంపేట దగ్గర లక్నేపల్లిలో) ఇల్లును కూడా పీవీ స్మారక భవనంగా పునర్నిర్మించారు. తెలంగాణ ముద్దుబిడ్డను కేసీఆర్ గారు గొప్పగా గౌరవించారు. మా కుటుంబానికే కాదు పీవీ అభిమానులందరినీ ఈ వేడుకలు సంతోషపెట్టాయి.
అంతిమ సంస్కారమూ ఆగం చేశారు
నూతన ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని కొత్త శకంలోకి నడిపించిన మహానుభావుడు మరణిస్తే కాంగ్రెస్ పాలకులు సంస్కారం మరిచారు. సంప్రదాయాల ప్రకారం అంతిమ సంస్కారాలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ఇంత నిర్దయగా ఉంటాయని నేను ఊహించలేదు. నాన్న భౌతిక కాయాన్ని ఎందుకు హైదరాబాద్ తీసుకువచ్చారో అర్థం కాలేదు. దేశానికి ప్రధానిగా పనిచేసిన వారి అంత్యక్రియలు రాజధాని ఢిల్లీలో జరుగుతాయి. నాన్నకు ఆ గౌరవం కాంగ్రెస్ దక్కనీయలేదు. ఢిల్లీలో కన్నుమూస్తే భౌతికకాయాన్ని హైదరాబాద్కు తరలించారు. ఆనాడు దేశంలోని ఎందరో రాజకీయ ప్రముఖులు వివిధ రంగాల వాళ్లు వచ్చి నివాళులు అర్పించారు. ప్రభుత్వం భారీగానే ఏర్పాట్లు చేసింది. కానీ, రావాల్సిన వాళ్లే రాలేదు. కాంగ్రెస్లోని కొంతమంది నాయకులు అప్పటి నుంచి నాన్న పోయేవరకు ఆయనకు దూరంగానే ఉంటున్నారు.
ఇచ్చింది కాదు.. సాధించుకున్నది
తెలంగాణ రాష్ట్రం ఎవరో ఇవ్వడం ఏంటి? 1956లో ఆంధ్రాతో కలిపింది కాంగ్రెస్సే. ఉన్న హైదరాబాద్ రాష్ర్టాన్ని ఆంధ్రాతో కలిపారు. అప్పుడు జరిగిన అన్యాయం వల్ల మన రాష్ట్రం సాధించుకోవడానికి 58 ఏండ్లు పోరాడాల్సి వచ్చింది. మనల్ని మనం పాలించుకోవాలి. ఎవరో మనల్ని పాలించడం ఏమిటని కేసీఆర్ గారు 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి, ఉద్యమాన్ని మొదలుపెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఎవరో ఇచ్చింది కాదు. పోరాడి తెచ్చుకున్నది. కేసీఆర్ గారి నాయకత్వం, ఎంతోమంది బలిదానాల వల్ల తెలంగాణ వచ్చింది. కొత్తగా ఎవరూ ఇచ్చిందేమీ లేదు.
దక్షిణాది వాళ్లంటే చులకన
దక్షిణాది వాళ్లు, తెలంగాణ వాళ్లు ఢిల్లీ నేతల కంటికానరు. ఎన్నికలొస్తే టూరిస్టుల్లాగా వస్తారు. మాటలు చెబుతారు. అంతే! కాంగ్రెస్ పార్టీ జరిపిన పీవీ శతజయంతి వేడుకలకు మాటవరసకు పిలిచారు. చెప్పాల్సిన వాళ్లు చెప్పాలి కదా! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాన్నగారి శత జయంతి వేడుకలను ఘనంగా జరిపింది. ‘పీవీ మన ఠీవి’ అని సీఎం కేసీఆర్ గారు ప్రకటించారు. ఆ వేడుకలకు మమ్మల్నందర్నీ పిలిచారు. సంతోషంగా పాల్గొన్నాం. పీవీ బిడ్డలుగా మేం గర్వపడ్డాం. ఏడాది పాటు సభలు, సమావేశాలు, ప్రదర్శనలు నిర్వహించారు. నాన్న రచనలు పునర్ ముద్రించారు. ‘నమస్తే తెలంగాణ’లో 365 రోజులు నాన్న వ్యాసాలు వచ్చాయి. ప్రతి రోజూ మేధావులు, రాజకీయ నాయకులు వ్యాసాలు రాశారు. వాటితో ఒక పుస్తకం ప్రచురించారు. ఆ ఠీవీని చాటేందుకు ఏడాది పొడవునా వేడుకలు జరిపారు. కాంగ్రెస్ వాళ్లు గుర్తు చేసుకోకపోయినా, తెలంగాణ ముద్దుబిడ్డను సీఎంగారు గొప్పగా గౌరవించారు.