KTR | కేవలం సర్పంచ్, పంచాయతీ ఎన్నికలకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతగా భయపడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. రెండేళ్లలో అద్భుతాలు చేశామని, రుణమాఫీ, ఇళ్లు, రేషన్ కార్డులు ఇచ్చామని కాంగ్రెస్ చెబుతున్న మాటలు నిజమే అయితే, ఎన్నికలంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఇచ్చిన 420 హామీలు అమలు చేసి ఉంటే ప్రజలే బ్రహ్మరథం పట్టేవారని, కానీ వైఫల్యాల భయంతోనే కాంగ్రెస్ నేతలు దాడులకు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారని మండిపడ్డారు.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం లింగంపల్లి గ్రామంలో కాంగ్రెస్ గూండాల చేతిలో దారుణ హత్యకు గురైన బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పల మల్లయ్య కుటుంబాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ పరామర్శించారు. మల్లయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం, బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని కేటీఆర్ అందజేశారు. పార్టీ ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. “పదేళ్లు మేము అధికారంలో ఉన్నాం.. ఏనాడూ మీలాగా ఆలోచించలేదు. మేము కూడా మీలాగే ఆలోచించి ఉంటే ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ పరిస్థితి ఉండేదా?” అని కేటీఆర్ ప్రశ్నించారు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని, కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా దిక్కుమాలిన రాజకీయాలు మాని, ప్రజలకు మంచి చేయడంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.
మీ 6 గ్యారంటీలు అమలు చేసుంటే
మీరు ఇచ్చిన 420 హామీలు అమలు చేసుంటే…
ప్రజలే మీకు ఓట్లు వేస్తారుపంచాయతీ ఎన్నికలకే ఇంత భయపడుతూ..
దౌర్జన్యాలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు ఒకటే మాట చెప్తున్నాఎప్పడు రోజులు మీవి కావు!
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS pic.twitter.com/IgMwi50C6Y
— BRS Party (@BRSparty) December 14, 2025
బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు కొనసాగితే, తాము కూడా తిరగబడక తప్పదని, అదే జరిగితే రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పి, పరిస్థితి చేయి దాటిపోతుందని హెచ్చరించారు. తెలంగాణలో ఇలాంటి హింసాత్మక సంస్కృతి గతంలో లేదని, ఇది మంచి పద్ధతి కాదని విజ్ఞప్తి చేశారు. మల్లయ్య చనిపోయిన వెంటనే రావాలనుకున్నా, ఉద్రిక్తతలు పెరగకూడదనే ఉద్దేశంతోనే ఆగానని కేటీఆర్ తెలిపారు. మల్లయ్య కుటుంబానికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని, తప్పకుండా మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని, రాగానే ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించే బాధ్యత తనదేనని కేటీఆర్ మాటిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా, మొక్కవోని ధైర్యంతో పోరాడి పంచాయతీ ఎన్నికల్లో సుమారు 50 శాతం సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలను కైవసం చేసుకున్న గులాబీ సైనికులకు కేటీఆర్ శిరస్సు వంచి పాదాభివందనం చేశారు. ప్రజలంతా కేసీఆర్ పాలన కోసం, ఆయనను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవడం కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు.