హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వ్యవసాయ రంగంలో సాధించిన విప్లవాత్మక ప్రగతి అందించే స్ఫూర్తితో, యావత్ దేశ రైతాంగానికి వ్యవసాయం పండుగైన నాడే భారతదేశానికి సంపూర్ణక్రాంతి చేకూరుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలను పురసరించుకొని సీఎం కేసీఆర్ దేశ, రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘పంటపొలాల నుంచి ధాన్యపు రాశులు ఇండ్లకు చేరుకున్న శుభ సందర్భంలో రైతన్న జరుపుకునే సంబురమే సంక్రాంతి.. నమ్ముకున్న భూతల్లికి రైతు కృతజ్ఞతలు తెలుపుకునే రోజే సంక్రాంతి పండుగ’ అన్నారు.
తెలంగాణ ప్రగతి దేశానికి నమూనా
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని పునరుజ్జీవింప చేసేందుకు చేపట్టిన కార్యాచరణతో తెలంగాణ పల్లెలు పచ్చని పంటపొలాలు, ధాన్యపురాశులు, పాడిపశువులు, కమ్మని మట్టివాసనలతో సంక్రాంతి శోభను సంతరించుకుని వైభవోపేతంగా వెలుగొందుతున్నాయని సీఎం కేసీఆర్ పేరొన్నారు. తెలంగాణలో వ్యవసాయరంగం సాధించిన ప్రగతి నేడు యావత్ దేశానికి మార్గదర్శనంగా నిలిచిందని తెలిపారు. రాష్ట్ర వ్యవసాయరంగాన్ని బలోపేతం చేసే దిశగా లక్షలాది కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్న ఒకేఒక్క రాష్ట్రం తెలంగాణ అని స్పష్టంచేశారు. రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఇప్పటివరకు రూ.2,16,000 కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని వివరించారు. రైతుల సంక్షేమం పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఇది తారాణం అన్నారు.
రాష్ట్ర ఆవిర్భావం నాటికి 1.31 కోట్ల ఎకరాలు మాత్రమే ఉన్న సాగు విస్తీర్ణం నేడు 2.04 కోట్ల ఎకరాలకు పెరిగిందని వివరించారు. ఇది దేశ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక పరిణామమని తెలిపారు. ఒకనాడు దండుగ అన్న వ్యవసాయం రాష్ట్రంలో నేడు పండుగ అయిందని, వ్యవసాయరంగాన్ని నమ్ముకుంటే జీవితానికి ఢోకా లేదనే విశ్వాసం తెలంగాణ రైతుల జీవితాల్లో తొణికిసలాడుతున్నదని, ఇదే విశ్వాసాన్ని దేశ రైతాంగంలో పాదుకొల్పుతామని స్పష్టం చేశారు. ఈ దిశగా యావత్ భారత ప్రజల సహకారంతో, సమిష్టి కృషితో దేశ వ్యవసాయ రంగ నమూనాను సమూలంగా మార్చి గుణాత్మక అభివృద్ధికి బాటలు వేయాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. ప్రజలంతా మకర సంక్రాంతి పండుగను సుఖసంతోషాలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, ప్రతి ఇల్లు సిరిసంపదలతో తులతూగాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.