KTR | హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో కొట్లాడుతున్నట్టు నాటకమాడుతూ బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణలో అంట కాగుతున్నాయని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులపై ఈడీ దాడులు జరుగుతున్నా బీజేపీ నేతలెవరూ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ నాయకులను ఈడీ నుంచి రక్షిస్తున్న పెద్దన్న ఎవరో ప్రజలకు తెలియాలని డిమాండ్ చేశారు. ‘ఫిక్షన్ కంటే వాస్తవం వింతగా ఉంటుందని రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలను చూస్తుంటే నమ్మక తప్పడంలేదు’ అని ఆదివారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన రెండు కీలక పరిణామాలను ఆయన ఉదహరించారు. రాష్ట్రంలో ఒక సంపన్న కాంగ్రెస్ మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాస్రెడ్డి నివాసంలో రెండు వారాల కిందట ఈడీ దాడి చేసిందని, దాడుల్లో వందల కోట్ల నగదు దొరికిందని మీడియాలో కథనాలు వచ్చాయని గుర్తుచేశారు. రెండు వారాలు పూర్తయినా ఈ సంఘటనకు సంబంధించి ఒక మాట కూడా బయటకి రాలేదని పేర్కొన్నారు. ఇప్పటికీ ఇటు కాంగ్రెస్, ఇటు బీజేపీ నుంచే కాకుండా కనీసం ఈడీ నుంచైనా అధికారిక లెక్కాపత్రం వెల్లడికాలేదని ఉదహరించారు.
కర్ణాటకలో జరిగిన వాల్మీకి కుంభకోణం ద్వారా వచ్చిన రూ. 40 కోట్ల అక్రమ ధనాన్ని పార్లమెంట్ ఎన్నికల సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ ఉపయోగించిందని స్వయంగా తన ప్రకటనలో ఈడీ వెల్లడించిన ఉదంతాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. కానీ, ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టులు ఏమీ జరగలేదని తెలిపారు. కనీసం దారిమళ్లిన నిధుల విషయంపైనా ఇప్పటికీ ప్రాథమిక విచారణ కూడా చేయకపోవడం పట్ల అనుమానాలున్నాయని పేర్కొన్నారు. ఈ పరిణామాలను పరిశీలిస్తే ఈడీ నుంచి తెలంగాణలో కాంగ్రెస్ నాయకులను రక్షిస్తున్న పెద్దన్న ఎవరనేది తేలాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.