జగిత్యాల, ఏప్రిల్ 18 : రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రగతి ఎక్కడ అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నిలదీశారు. రేవంత్రెడ్డి క్యాబినెట్లో ఒకరికి టెన్ పర్సంటేజ్ మంత్రి అనే పేరుందని ఎద్దేవా చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రెస్మీట్పై కొప్పుల శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్ పాలనలో 2016 నుంచి 2023 వరకు 6,47,479 రేషన్ కార్డులు జారీకాగా 20.69 లక్షల మంది లబ్ధిపొందినట్టు గుర్తుచేశారు.
నిరుపేదలకు 20 లక్షల ఇండ్లు నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం, మొదటి విడుతలో మంజూరు చేసిన 4.5 లక్షల ఇండ్లలో చాలామంది అనర్హులను ఎంపిక చేసిందని మండిపడ్డారు. రెండున్నరేండ్లలో ఎన్ని వేల ఇండ్లు పూర్తిచేసి ప్రారంభించారని మంత్రి అడ్లూరిని ప్రశ్నించారు.
జగిత్యాల జిల్లాలో నిర్మించిన 4,520 డబుల్ బెడ్రూం ఇండ్లు కేసీఆర్ ప్రభుత్వంలో కట్టినవేనని గుర్తుచేశారు.
హైదరాబాద్ పరిసరాల్లోని 9,292 ఎకరాల పారిశ్రామిక భూములకు సంబంధించి రూ.5 లక్షల కోట్ల భూ కుంభకోణం, అమృత్ టెండర్లు, మూసీ ప్రక్షాళన ప్రాజెక్టులో భారీ అవినీతికి తెరతీస్తున్నారని ధ్వజమెత్తారు. కార్పొరేషన్లకు కేటాయించిన రూ.14,522 కోట్లలో రూ.306 కోట్లు మాత్రమే ఖర్చు చేసి, మిగిలిన నిధులను దుర్వినియోగం చేశారని విమర్శించారు.
గురుకుల పాఠశాలల్లో రూ.200 కోట్ల విలువైన కోడిగుడ్లలో అవినీతి జరిగిందని, సింగరేణి కోల్ సాంలో మంత్రులు అవినీతి ఆరోపణలు ఎదురొంటున్నారని చెప్పారు. రోళ్లవాగు ప్రాజెక్టు పనులు 95 శాతం బీఆర్ఎస్ ప్రభుత్వమే చేసిందని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో మూడేండ్ల క్రితం మల్లాపూర్ నుంచి వెల్గటూరు మండల చివరి గ్రామాలకు సాగునీటిని సరఫరా చేయడానికి రూ.13 కోట్లు మంజూరు చేయించామన్నారు. 10 శాతం పనులను ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చేయించడం లేదని విమర్శించారు.