Sabitha Indra Reddy | రంగారెడ్డి : రంగారెడ్డి రూపురేఖలు మార్చే ఐటీఐఆర్ ప్రాజెక్టు( ITIR Project )ను ఎందుకు పక్కన పెట్టారని ప్రధాని మోదీని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి( Sabitha Indra Reddy ) నిలదీశారు. ప్రధాని మోదీ( PM Modi ) విభజన హామీలు నెరవేర్చకుండా.. రాజకీయ ప్రసంగాలు చేసి వెళ్లిపోయారని మంత్రి ధ్వజమెత్తారు.
షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో జిల్లా పార్టీ ఇంచార్జి ఎమ్మెల్సీ రమణతోకలిసి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. దేశ ప్రధాని వస్తే రాష్ట్రానికి ఏమైనా మేలు జరుగుతుందని ప్రజలంతా ఆశిస్తారని తీరా చూస్తే అలాంటిదేమీ ఉండదని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన సీఎం కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకెళ్తుంటే, కేంద్రం మాత్రం రాష్ట్రంపై వివక్ష చూపుతుందని మండిపడ్డారు.
మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, 24 గంటల విద్యుత్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళిత బంధు, రైతు బంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు, మత్స్యకారులకు చేప పిల్లల పంపిణీ ఇలా అన్ని వర్గాల వారికి తెలంగాణలో న్యాయం చేకూరుతుందని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
నేడు కేసీఆర్ కుటుంబం గురించి మాట్లాడే ముందు.. తెలంగాణ ఉద్యమంలో వారు ఎలాంటి పాత్ర పోషించారో తెలుసుకోవాలని సూచించారు. కేసీఆర్, కేటీఆర్, కవిత తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకపాత్ర పోషించారని, రాష్ట్ర ఏర్పాటు కోసం నిర్విరామంగా పోరాడారని పేర్కొన్నారు. వారి పోరాటం ప్రజలందరికీ తెలుసని సబిత పేర్కొన్నారు.
తెలంగాణ అభివృద్ధిని మోదీ కాక్షింస్తే ఫార్మా సిటీకి, మెట్రో ఫేజ్ 2కు సహకరించాలని సబిత సూచించారు. మెడికల్ కాలేజీలు, నోవదయ పాఠశాలలను తెలంగాణకు ఇవ్వాలన్నారు. సీఎం కేసీఆర్ నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టారని, పార్లమెంట్కు కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని మోదీని సబిత డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసం పసిపిల్లల జీవితాలతో ఆడుకోవద్దని సూచించారు. పేపర్ లీకేజీ ఘటనలో పట్టుబడ్డ బీజేపీ నాయకులు బుకాయింపు మాటలు మాట్లాడుతున్నారని, ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందన్నారు సబితా ఇంద్రారెడ్డి.