హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో బండి సంజయ్ ఎక్కడున్నాడని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్రం దిగివచ్చే దాకా పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన మహాధర్నాలో ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కొనాలని కేంద్రాన్ని అనేక రూపాల్లో కోరామని, అన్ని ప్రక్రియలు ముగిసిన తర్వాతే పోరాటానికి దిగామని చెప్పారు.
గత నెలరోజులుగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర బీజేపీ నాయకులు నాటకాలాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నాం, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడైనా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తున్నారో చూపించాలని డిమాండ్ చేశారు.
ఎకరానికి రూ.10 వేలు ఇస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని చెప్పారు. అప్పులతో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి లేకుండా చేశామన్నారు. రైతు బీమా ద్వారా 65 వేల మంది రైతులు చనిపోతే రూ.3250 కోట్లు ఇచ్చామని తెలిపారు. కరోనా సమయంలో కూడా రైతుకు నష్టంకలగొద్దని రైతు బంధు ఇచ్చామని వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎఫ్సీఐకి అమ్మామన్నారు. రెండు పంటలు పండించే ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. పంజాబ్కు ఒక నీతి, ఉత్తరప్రదేశ్కు, బీహార్కో నీతి, తెలంగాణకు ఓ నీతి అంటే నడవదని చెప్పారు.
కల్లాల గురించి, ధాన్యం గురించి అవగాహన లేని బీజేపీ నాయకులు అబద్దాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్ ఎక్కడున్నాడని బండి సంజయ్ అడుగుతున్నాడు.. మరి అదే ఉద్యమంలో బండి సంజయ్ ఎక్కడున్నాడని ప్రశ్నించారు. 14 ఏండ్లపాటు సాగిన రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ గురించి మాట్లాడనివారు లేరన్నారు. నిండిన చెరువుల్లో, పారుతున్న కాలువల్లో, పండిన కల్లాల్లో, తెలంగాణ అభివృద్ధిలో సీఎం కేసీఆర్ ఉన్నాడని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు, ఉద్యమం చేసి తెలంగాణ సాధించారని చెప్పారు. ఎవరు అడ్డుపడ్డా ధాన్యం కొని తీరాల్సిందేనని, యాసంగిలే ఏం పండించాలో చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు.