Harish Rao | ఇప్పటికప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్కు వంద సీట్లు వస్తాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో ఆయన బుధవారం మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. రేవంత్రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అని స్పష్టం చేశారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని.. రేవంత్ సీఎం అయ్యేవాడు కాదన్నారు. కేసీఆర్కు, రేవంత్కు నక్కకు.. నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. సీనియర్లు తన కుర్చీని గుంజుకోకుండా రేవంత్ చేసుకోవాలని.. తన కుర్చీని ఎప్పుడు గుంజుకుపోతారోనన్న భయంలో రేవంత్ ఉన్నాడన్నారు. ఐదేళ్ల తర్వాత వచ్చేది బీఆర్ఎస్ మాత్రమేనని.. సీఎం అయ్యేది కేసీఆర్ అని స్పష్టం చేశారు. దేశంలో కాంగ్రెస్ మూడుసార్లు ఓడిందని.. మరి కాంగ్రెస్ ఖతం అయిపోయిందా? అంటూ ప్రశ్నించారు. 31 సాకులు చూపుతూ రుణమాఫీ చేయకుండా రేవంత్ రైతులను మోసం చేశారని విమర్శించారు.
ఆరు మంత్రి పదవులు నింపేందుకే రేవంత్కు హైకమాండ్ అనుమతి ఇవ్వట్లేదని.. విద్య, మైనారిటీ, పోలీసుశాఖలకు మంత్రులు, డిప్యూటీ స్పీకర్, చీఫ్విప్ లేరన్నారు. కేసీఆర్ పవర్ఫుల్ ఫైటర్, లీడర్ అని చెప్పారు. రేవంత్రెడ్డి చిల్లరమాటలు ఆపితే మించిదని సూచించారు. ఓ మంత్రి గవర్నర్ని కలిశారని.. ఇంకో మంత్రి కాబోయే సీఎంనని సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారన్నారు. సీఎం చిట్చాట్లో మాట్లాడి కుర్చీకి ఉన్న గౌరవం తగ్గించారని మండిపడ్డారు. రేవంత్రెడ్డి అబద్దాలు చూసి గోబెల్స్ కూడా సిగ్గుపడుతారన్నారు. రేవంత్ మాట్లాడితే ఎక్కడ ఆ దుర్భాష విని పిల్లలు చెడిపోతారోనని.. ఇండ్లల్లో తల్లిద్రండులు టీవీలను బంద్ చేస్తున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్కు మూడువైపులా సముద్రం ఉందంటారని.. అలా అయితే గోవా వెళ్లడం ఎందుకని జోకులు వేస్తున్నారన్నారు. రాజీవ్ కంప్యూటర్ కనిపెట్టాడని అంటాడని.. దిల్సుఖ్నగర్లో విమానాలు అమ్ముతారని.. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండీ ఇలా మాట్లాడుతూ పోతే.. గ్రూప్-1 పరీక్ష రాసేవాళ్లు ఏమైపోవాలి? అన్నారు.
మల్లన్నసాగర్ బాధితులకు ఒక్క ఇల్లూ కట్టలేదని తప్పుగా మాట్లాడారని.. మల్లన్నసాగర్కు 50వేల ఎకరాలు కాదు.. 17వేల ఎకరాలేనన్నారు. 14వేల ఎకరాలు ప్రభుత్వ పట్టా అసైన్డ్ భూమి.. 3వేల ఎకరాలు ఫారెస్ట్ భూమి అని చెప్పారు. ఏడు గ్రామాలు ముంపునకు గురైతే 14 గ్రామాలు అయ్యాయని తెలిపారు. సీఎం ఇలా మాట్లాడుతూపోతే ఇక ఆయన మాటలను ఎవరూ నమ్మరన్నారు. తాను కొడంగల్లో ఒడితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని.. సన్యాసం తీసుకోకుండా ఎంపీకి ఎందుకు పోటీశారని నిలదీశారు. శుద్ధమైన నదీ జలాలకు బీఆర్ఎస్ అనుకూలమని.. పేదల ఇండ్ల కూల్చివేతకు వ్యతిరేకమని క్లారిటీ ఇచ్చారు. కాళేశ్వరం మంచినీళ్లు మూసీకి తీసుకురావాలన్నది కేసీఆర్ విజన్ అని తెలిపారు. కొండపోచమ్మ సాగర్ నుంచి మూసీకి నీళ్లు తెచ్చేందుకు కేసీఆర్ డీపీఆర్ చేశారన్నారు.
కొండపోచమ్మ సాగర్ కాకుండా మల్లన్నసాగర్ నుంచి ఎందుకు మారుస్తున్నారని ప్రశ్నించారు. రూ.1100కోట్లతో అయ్యే పనిని రూ.7వేలకోట్ల కమిషన్ కోసం పెంచారని మండిపడ్డారు. గచ్చిబౌలిలో 450 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని.. మూసీ బాధితులకు ఆ స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ.75కోట్లకు ఎకరా భూమి అమ్మింది రేవంత్ ప్రభుత్వమేనన్నారు. 2013 యాక్ట్ కంటే బాగా ఇవ్వమని తాము అడుగుతున్నామన్నారు. రేవంత్ పాలనలో ఇండ్లు కూల్చారు తప్పా.. ఒక్కటైనా కట్టారా? అని హరీశ్రావు నిలదీశారు. ఇండ్లను కూలగొట్టి మాల్ కట్టొద్దని అంటున్నామని.. ఏక్ పోలీసింగ్ కోసం పోలీసుల పోరు జరుపుతున్నారని.. రేవంత్ చెప్పిందే వారు అడుగుతున్నారన్నారు. తల్లి పిల్లల్ని నమ్మనట్లుగా హోంశాఖను తనవద్దే ఉంచుకొని నమ్మకపోతే ఎలా? అంటూ ధ్వజమెత్తారు. అంబేద్కర్ విగ్రహానికి సీఎం దండ వేయరని.. అక్కడికి ఎవరినీ వెళ్లనీయరంటూ హరీశ్రావు ధ్వజమెత్తారు.