హైదరాబాద్, ఫిబ్రవరి 2, (నమస్తే తెలంగాణ) కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ కుంగుబాటుపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలన్న విజ్ఞప్తిపై ప్రభుత్వ వైఖరి ఏమిటో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. దీనితోపాటు కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ సేకరించిన నిధులపై దర్యాప్తు విషయంలోనూ ప్రభుత్వ వైఖరి ఏమిటో చెప్పాలని, ఆ విషయాలను రాతపూర్వకంగా తెలియజేయాలని స్పష్టం చేసింది.
మేడిగడ్డ బరాజ్ కుంగుబాటుపై ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తు ఏ దశలో ఉన్నదో వివరిస్తూ నివేదిక సమర్పించాలని ఆదేశించింది. కాంగ్రెస్ నేత జీ నిరంజన్ దాఖలు చేసిన పిల్పై హైకోర్టు సీజే అలోక్ అరాధే, జస్టిస్ అనిల్కుమార్ ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. దర్యాప్తు తీరుతెన్నులపై నివేదిక ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.