PM Modi | హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): పాలమూరు గడ్డపై పదేండ్ల కిందట ఎన్నికల ఆర్భాటంగా హామీలిచ్చిన మోదీ.. ఇప్పటికీ నెరవేర్చలేదు. పదేండ్ల తర్వాత ఇక్కడికి వస్తున్న సందర్భంగా 2014 ఏప్రిల్ 22న ఆయన మాట్లాడిన మాటలను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. నాడు మోదీ మాట్లాడుతూ.. ‘తెలంగాణలో యువకులు వందల సంఖ్యలో ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. అవి కాంగ్రెస్ పాప ఫలితం. తెలంగాణకు ఇప్పుడేం కావాలి? తెలంగాణ అభివృద్ధి చెందాలి. ఇక్కడ రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? రైతులకు నీళ్లు ఉంటే మట్టిలో బంగారం పండిస్తరు. రాహుల్గాంధీ నిన్న వచ్చాడు. ఎన్నికల్లో గెలిపించండి పాలమూరు ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేస్తా అని వాగ్దానం చేశాడు. మరి గత పదేండ్లుగా ఏం చేశావ్? పండుకున్నవా? మీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది కదా.. ఎందుకు చేయలేదు? వాళ్లు రైతుల గురించి పట్టించుకోరు. బాధ తెల్వదు. మాకు మద్దతివ్వండి.. నీళ్లు ఇస్తాం. కరెంటు ఇస్తాం’ అని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ సిటీబ్యూరో : మోదీ పర్యటనపై హైదరాబాద్లో వెలిసిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఆదివారం ప్రధాని మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ‘తెలంగాణ పుట్టుకను పదే పదే అవమానించిన నీకు తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు లేదు.. బిడ్డను బతికించడం కోసం తల్లిని చంపారు. అంటూ తెలంగాణపై పార్లమెంట్ సాక్షిగా మోదీ చేసిన వ్యాఖ్యలను తేదీలతో సహా పేర్కొన్నారు. మోదీకి రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదంటూ పోస్టర్లలో పేర్కొన్నారు.