Bandi Sanjay | విద్యానగర్: దేశాన్ని విభజించాలంటూ కాంగ్రెస్ ఎంపీ డీకే సురేశ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలకు, టెర్రరిస్టులకు తేడా ఏముందని ప్రశ్నించారు. కరీంగనగర్ పరిధిలోని తీగలగుట్టపల్లి కోదండరామాలయ సమీపంలో రూ.10 లక్షల ఎంపీ నిధులతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి, జిల్లా జైలు వద్ద రూ.15 లక్షల ఎంపీ లాడ్స్తో కొనుగోలు చేసిన అంబులెన్స్, వైద్య పరికరాలను శనివారం ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
“కశ్మీర్ను ప్రత్యేక దేశం కావాలని టెర్రరిస్టులు, పంజాబ్ను ఖలిస్థాన్ దేశంగా ప్రకటించాలని ఉగ్రవాదులు చెబుతున్నారు.. ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీ సురేశ్ భారత్ను దక్షిణ దేశంగా, ఉత్తర దేశంగా విభజించాలని అంటున్నారు.. మరి వాళ్లకు, వీళ్లకు తేడా ఏమిటి?”అని ప్రశ్నించారు. గతంలో రాహుల్ గాంధీ సైతం భారతీయుడిగా చెప్పుకునేందుకు సిగ్గు పడుతున్నానని దేశాన్ని కించపర్చారని గుర్తు చేశారు. ఆయన బావ రాబర్ట్ వాద్రా సైతం భారత్ దుర్భల దేశమని భారతీయులను కించపర్చారని మండిపడ్డారు. భారత్కు వ్యతిరేకంగా మాట్లాడే నేతలపై దేశ ద్రోహం కేసు పెట్టాలని కోరారు. భారత్ను ముక్కలు చేయాలని కోరడం ముమ్మాటికీ దేశ ద్రోహమేనని, ప్రజలంతా వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.
బీజేపీ మత రాజకీయాలు చేస్తోందంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందిస్తూ అయోధ్యలో రామాలయాన్ని నిర్మించింది తామేనని, ఏం చేసుకుంటారో చేస్కోండని, అయోధ్యలో రామమందిరం స్థానంలో బాబ్రీమసీదును నిర్మిస్తామని చెప్పే దమ్ము కాంగ్రెస్ నేతలకు ఉందా? అని ప్రశ్నించారు.