హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సహా దేశవ్యాప్తంగా యూరియా సమస్యతో రైతాంగం అవస్థ పడుతుంటే కేంద్రం ఏం చేస్తున్నదని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు నిలదీశారు. లోక్సభలో శుక్రవారం ఆయన యూరి యా సమస్యను లేవనెత్తి, ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రశ్నోత్తరాల సమయంలో నామా మాట్లాడుతూ.. యూరి యా కొరతను అధిగమించేందుకు కేంద్రం తీసుకున్న చర్యలేమిటని ప్రశ్నించారు. కేంద్రం వద్ద ఉన్న సమగ్ర ప్రణాళికను వెల్లడించాలని పట్టుబట్టారు. దేశమంతటికీ ఎంత యూరియా కావాలి?
కేంద్రం కార్యాచరణ ఏమిటని ప్రశ్నించారు. యూరియాపై గత ఐదేండ్లలో రా ష్ట్రాలకు ఇచ్చిన సబ్సిడీ వివరాలను అడిగితే.. అసమగ్రంగా ఇచ్చారని విమర్శించారు. నూతన యూరియా పాలసీతో ఇప్పటివరకు ఎటువంటి ప్రగతి సాధించారో తెలపాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ.. ఎరువులను దేశీయంగా ఉత్పత్తి చేయడంతోపాటు దిగుమతుల ద్వారా యూరియా సరఫరాను మెరుగుపరుస్తున్నామని చెప్పుకొచ్చారు. 2018-19లో ఎరువులపై రూ.73,435.21 కోట్ల సబ్సిడీ, 2021-22లో రూ.1,57,640.09 కోట్లు, 2022-23లో రూ.2,54,798.93 కోట్లు సబ్సిడీగా ఇచ్చినట్టు వివరించారు.
హైదరాబాద్లో సుప్రీంకోర్టు శాశ్వత బెంచ్ను ఏర్పాటుచేయాలని బీఆర్ఎస్ సభ్యుడు డాక్టర్ రంజిత్రెడ్డి కోరారు. శుక్రవారం లోక్సభలో ఆయన ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టి మాట్లాడారు. హైదరాబాద్లో సుప్రీంకోర్టు పర్మినెంట్ బెంచ్ ఏర్పాటు చేయడం ద్వారా న్యాయమూర్తుల సంఖ్య పెరిగి, కేసులు సత్వరం పరిషారం అవుతాయని చెప్పారు. ఫిర్యాదుదారుల ఖర్చులు తగ్గుతాయని అన్నారు.