Medigadda Barrage | జయశంకర్ భూపాలపల్లి, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): మేడిగడ్డ బరాజ్ కుంగుబాటుకు గురై నాలుగు నెలలు గడుస్తున్నా కేవలం విచారణలు, సమావేశాలు, పవర్పాయింట్ ప్రజెంటేషన్ల పేరుతో ప్రభుత్వం కాలం వెళ్లదీస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వానకాలం వచ్చే వరకు పొడిగిస్తూ బరాజ్ను నీటిపాలు చేస్తారనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇప్పటికే తెలంగాణలో తాగు, సాగు నీటి సమస్యలు తలెత్తి వ్యవసాయ భూములన్నీ నోర్లు తెరుస్తున్నాయి. ప్రాజెక్టులపై ఇంకా నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అయినా, ప్రభుత్వం ఏమి చేయబోతున్నదో ఎవరికీ అంతు చిక్కడం లేదు. మేడిగడ్డ బరాజ్లో ఏడో బ్లాకులో 20వ పిల్లర్ గత ఏడాది అక్టోబర్ 21న కుంగిపోయింది. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటుపై అధ్యయన కమిటీ వేస్తామని ప్రకటించినా ఇంతవరకు ఆ ఊసెత్తడం లేదు. ఇదిలా ఉండగా మేడిగడ్డ, అన్నారం బరాజ్లో ఏర్పడిన లోపాలను ఇన్వెస్టిగేషన్ చేసేందుకు నిర్మాణ సంస్థ డైనోసార్, పార్సన్ అనే ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించింది. డైనోసార్ సంస్థ గత రెండు నెలలుగా ఇన్వెస్టిగేషన్ పనులు కొనసాగిస్తున్నది. కానీ, విచారణ వివరాలను వెల్లడించడంలేదు.
అధికారులు సైతం ఏడోబ్లాకు వద్ద పైనుంచి నీరు వస్తే దారి మళ్లించే ప్రయత్నాలు సైతం చేసుకోలేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అన్నారం బరాజ్లోని నీటిని వదలగా ఏడోబ్లాకుకు నీరు చేరుకున్నాయి. ప్రస్తుతం విచారణ పనులు మళ్లీ పెండింగ్లో పడ్డాయి. కాగా, మేడిగడ్డ బరాజ్పై విజిలెన్స్ విచారణకు ప్రభు త్వం ఆదేశించగా, విజిలెన్స్ డీజీ రాజీవ్త్రన్ విచారణ చేపట్టారు. మేడిగడ్డ బరాజ్లోని పిల్లర్లకు విజిలెన్స్ బృందం కోర్డ్రిల్లింగ్ టెస్టు చేయించింది. ఈ టెస్టులో పిల్లర్లు పూర్తిగా నాణ్యతతోనే ఉన్నట్టు విజిలెన్స్ బృందం గుర్తించినట్టు సమాచారం.ఈ విషయాన్ని విజిలెన్స్ బృందం గోప్యంగా ఉంచింది. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో మేడిగడ్డ వద్ద మంత్రులు, ఎమ్మెల్యేల బృందం సమావేశం నిర్వహించగా ఇన్చార్జి ఈఎన్సీ సుధాకర్రెడ్డి, విజిలెన్స్ డీజీ రాజీవ్త్రన్ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందులో విజిలెన్స్ బృందం కోర్డ్రిల్లింగ్ టెస్టు చేయించిన విష యం, దాని ఫలితం గురించి వెల్లడించలేదు.
మేడిగడ్డ, అన్నారం బరాజ్ లోపాలపై ఆదిలోనే సీడబ్ల్యూసీ, ఎన్డీఎస్ఏ బృందం ప్రాథమిక విచారణ చేపట్టాయి. అనంతరం నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు మేడిగడ్డ వద్ద మకాం వేసి సమీక్ష నిర్వహించారు. అప్పటి ఈఎన్సీ మురళీధర్ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా బరాజ్లపై విచారణకు కమిటీ వేస్తామని మంత్రి ఉత్తమ్ ప్రకటించి వెళ్లిపోయారు. అనంతరం సీఎం రేవంత్రెడ్డి సైతం మళ్లీ ఇక్కడే సమీక్ష నిర్వహించి పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని, ఎన్డీఎస్ఏతో విచారణ జరిపిస్తామని చెప్పారు. అప్పటినుంచి విచారణ లేదు.. కమిటీ ఏర్పాటు లేదు. ఇటీవల రాష్ట్ర డ్యాం సేఫ్టీ నిపుణుల బృందం వచ్చి అన్నారం, మేడిగడ్డ బరాజ్లను పరిశీలించి వెళ్లింది. నివేదికను ఎన్డీఎస్ఏకు అందజేస్తామని, వారు వచ్చి పరిశీలన చేస్తారని తెలిపింది. అయినా, ఎలాంటి పురోగతి లేదు. వానకాలం సమీపిస్తున్న నేపథ్యంలో అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం వానకాలం వరకు ఇలాగే కాలయాపన చేస్తూ చేతులెత్తేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్టును నీటిపాలు చేసేందుకే కాలయాపన చేస్తున్నారనే ఆందోళన వ్యక్తమవుతున్నది. బరాజ్లో ఏర్పడిన లోపాలను త్వరగా సవరిస్తే సాగునీరు అందించే అవకాశం ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం బరాజ్ను ఆదివారం విశాఖపట్టణానికి చెందిన గ్రౌటింగ్ నిపుణులు పరిశీలించారు. బరాజ్లో ఏర్పడిన సీపేజ్లకు ఆప్కాన్స్ సంస్థ కెమికల్ గ్రౌటింగ్ చేసిన విషయం తెలిసిందే. అయినా మళ్లీ చిన్న చిన్న సీపేజ్లు కనిస్తున్నాయి. వాటితో ప్రమాదమేమీ లేదని ఇటీవల పర్యటించిన రాష్ట్ర డ్యాం సేప్టీ నిపుణులు తేల్చినప్పటికీ ఎన్డీఎస్ఏ పర్యటనకు ముందే ఇతర నిపుణులతో ఇన్వెస్టిగేషన్ చేయించాలని ఈఎన్సీ అనిల్కుమార్ ఆదేశించినట్టు సమాచారం. ఈ మేరకు విశాఖపట్టణం నుంచి ఆరుగురు గ్రౌటింగ్ నిపుణులు అన్నారం బరాజ్ను సందర్శించారు. గ్రౌటింగ్ చేసిన విధానంపై పరిశీలన జరిపారు. డ్రిల్లింగ్, గ్రౌటింగ్ మిషనరీతో శాంపిల్స్ సేకరించారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి సాండ్ గ్రౌటింగ్, కెమికల్ గ్రౌటింగ్, మైక్రో కాంక్రీట్ గ్రౌటింగ్లో ఏ పద్ధతిలో చేస్తే బాగుంటుందనే విషయమై పరిశీలన జరిపి సూచనలు చేయనున్నారు. ఇదిలా ఉండగా అన్నారం బరాజ్లో ఇన్వెస్టిగేషన్కు అవకాశం ఇచ్చిన పార్సన్ సంస్థను విచారణ నుంచి ప్రభుత్వం తప్పిస్తున్నట్టు సమాచారం.