న్యూఢిల్లీ : కరోనా కట్టడికి దేశ రాజధానిలో ఆరు రోజుల పాటు లాక్డౌన్ అమల్లో ఉంటుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన కొద్దిసేపటికే నగరంలో మద్యం దుకాణాల ముందు జనం బారులుతీరారు. మందుబాబులు కొవిడ్-19 నిబంధనలను గాలికొదిలి లిక్కర్ షాపుల వద్ద గుమికూడారు. పొడవాటి క్యూల్లో నిల్చున్న జనంలో కొందరు మాస్క్ ధరించగా, మరికొందరు మాస్క్ లేకుండా ఉన్నారు.
భౌతిక దూరం పాటించకుండా మద్యం బాటిళ్ల కోసం బారులుతీరారు. ఢిల్లీలోని శివపురి గీతా కాలనీలో మద్యం దుకాణానికి వచ్చిన ఓ మహిళను కొవిడ్ లాక్డౌన్ గురించి ప్రశ్నించగా, తనకు ఇంజక్షన్ అవసరం లేదని మద్యం కావాలని పేర్కొనడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఢిల్లీలో నేటి రాత్రి పది గంటల నుంచి వచ్చే సోమవారం ఉదయం ఐదు గంటల వరకూ ఆరు రోజుల పాటు పూర్తి లాక్డౌన్ అమల్లో ఉంటుందని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.