రాజన్న సిరిసిల్ల, మార్చి 27 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై సిరిసిల్ల నేతన్నలు(Weavers) భగ్గుమంటున్నారు. వస్త్ర పరిశ్రమ సంక్షోభ నివారణకు చర్యలు తీసుకోవడం లేదంటూ మండిపడుతున్నారు. ఈ మేరకు బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో వాడవాడలా భిక్షాటన చేసి నిరసన (Protest) తెలిపారు. ఈ సందర్భంగా పవర్లూం వర్కర్స్ యూనియన్ సిరిసిల్ల జిల్లా కార్యదర్శి కోడం రమణ మాట్లాడారు. మూడు నెలల నుంచి మరమగ్గాలు బంద్ పెట్టడంతో కార్మికులంతా ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని ఆవేదన చెందారు.
వస్త్ర పరిశ్రమ సంక్షోభంపై పలుసార్లు మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసి వినతి పత్రాలు సమర్పించినా ఫలితం లేదని వాపోయారు. పరిశ్రమలో యజమానులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు రూ. 290 కోట్లు విడుదల చేయక కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తున్నదని ధ్వజమెత్తారు. పనిలేక కార్మికులంతా ఆకలితో అలమటిస్తున్నారని ఆవేదన చెందారు.
కార్మికుల దయనీయ పరిస్థితి చూసైనా వెంటనే చొరవ తీసుకోవాలని, బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధి కోల్పోయిన కార్మికులకు రూ. పదివేల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్పిన్ వర్కర్స్ యూనియన్ సిరిసిల్ల అధ్యక్షుడు సిరిమల్లె సత్యం, కుమ్మరి కుంట కిషన్, ఉడుత రవి, నక్క దేవదాస్, తదితరులు పాల్గొన్నారు.