నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు
బలహీనపడిన తీవ్ర అల్పపీడనం
సాధారణ హెచ్చరిక జారీ
హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): ఒడిశా తీర పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం గురువారం ఉదయం 5.30 గంటలకు బలహీన పడి అల్పపీడనంగా మారింది. దీంతో తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం తప్పిం ది. వర్షాలు పూర్తిగా తగ్గి కొద్ది రోజులు తెరిపి ఇస్తే కానీ గ్రామాలు, పట్టణాల నుంచి వరదనీరు బయటకు వెళ్లడానికి అవకాశం ఉంటుంది.
పలు జిల్లాలకు భారీ వర్షాలు- ఆరెంజ్ అలర్ట్
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయని పేర్కొన్నది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో శుక్రవారం వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ హెచ్చరిక జా రీచేసింది. పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, ములు గు, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి జిల్లా ల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రాథమిక హెచ్చరిక చేసింది.
5 కేంద్రాల్లో 20 సెంటీ మీటర్ల వర్షపాతం
గడిచిన 24 గంటల్లో నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురువగా మిగిలిన జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. 20 సెంటీ మీటర్లపైన 5 కేంద్రాల్లో వర్షం కురిసింది. 25 కేంద్రాల్లో 15 సెంటీ మీటర్లపైన, 52 కేంద్రాల్లో 10 సెంటీ మీటర్లపైన వర్షం కురిసింది. అత్యధికంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో 29.48 సెంటీ మీటర్ల వర్షం కురిసినట్టు టీఎస్డీపీఎస్ తెలిపింది.