హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఉదయం, సాయంత్రం వాతావరణం చల్లబడి ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడ్డాయి. మధ్యాహ్నం దాదాపు అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రెండు మూడు రోజులు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38.9 డిగ్రీలుగా, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 20.3 డిగ్రీల సెల్సియస్లుగా ఉండనున్నట్టు చెప్పింది. శుక్రవారం ఆదిలాబాద్లో 42, భద్రాచలం 41, హనుమకొండ 38.5, హైదరాబాద్ 36.5, ఖమ్మం 40.2, మహబూబ్నగర్ 40, మెదక్ 39.7, నల్లగొండ 41, నిజామాబాద్ 40, రామగుండం 39.6 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది.