ములుగు : జిల్లాలోని మంగపేట మండలం శనిగకుంటలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం ఘటనలో 40 గుడిసెలు దగ్ధం కావడం పట్ల పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్రమాదంలో నష్ట పోయిన కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
విషయం తెలుసుకున్న వెంటనే మంత్రి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి ఘటనకు దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అవసరమైన సహాయక, పునరావాస చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాగా, శనగ కుంటలో గురువారం సాయంత్రం వచ్చిన ఈదురుగాలులతో పొలాల్లోని ఎరగడి మంటలు అంటుకొని అగ్ని ప్రమాదం సంభవించడంతో సుమారు 40 ఇళ్లు దగ్ధమయ్యాయి.