వనపర్తి : ఏదుల రిజర్వాయర్ నిర్వాసితులకు అండగా ఉంటామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన ఏదుల రిజర్వాయర్లో మునిగిపోతున్న బండరావిపాకుల గ్రామస్తుల కోసం గౌరీదేవిపల్లి సమీపంలో ఆర్ అండ్ ఆర్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బండరావిపాకులలో ప్రజలకు ప్లాట్లను పంపిణీ చేసి మంత్రి మాట్లాడారు. 63 ఎకరాలలో బండరావిపాకుల ఆర్ అండ్ ఆర్ సెంటర్
50 ఎకరాలలో ప్లాటింగ్ పూర్తయిందన్నారు. రూ.27 కోట్లతో అక్కడ సకల వసతులు కల్పిస్తామని
మంత్రి తెలిపారు. బడి, గుడి, పార్కు, పంచాయతీ భవనం, కరంట్, నీళ్లు సకల వసతులనూ కల్పిస్తామన్నారు. ముంపు గ్రామాలలో సర్వం కోల్పోయిన ప్రజలకు భవిష్యత్లో ఏర్పాటు చేయబోయే వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్లో ఉపాధి కల్పిస్తామని భరోసానిచ్చారు. అర్హులందరికి ప్రభుత్వ పథకాలలో బ్యాంకు గ్యారంటీ లేకుండా లోన్ల సదుపాయం కల్పిస్తామని పేర్కొన్నారు. ఏదుల రిజర్వాయర్ చేపల మీద ముంపు గ్రామాల ప్రజలకు హక్కులు కల్పించేందుకు కృషి
చేస్తామన్నారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ప్రాజెక్టుల ముంపులో ఎంత పరిహారం ఇస్తున్నారో ఇక్కడా అంతే ఇస్తున్నామని వివరించారు. అలాగే మిగిలిపోయి, ఆఖరున ధరఖాస్తు చేసుకున్న 167 మందికి న్యాయం చేస్తామని హామీనిచ్చారు. 318 ఇండ్ల ప్లాట్లు వద్దన్న వారికి న్యాయం జరిగేలా చూస్తాం. న్యాయబద్దంగా అర్హులయిన ప్రతి ఒక్కరికి సాయం అందించేలా చూస్తామని మంత్రి తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీ పి. రాములు, ఎమ్మెల్సీలు కూచుకుళ్ల దామోదర్ రెడ్డి , కసిరెడ్డి నారాయణరెడ్డి, జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజ, మర్రి జనార్దన్ రెడ్డి, బీరం హర్షవర్దన్ రెడ్డి, ఆర్డీఓ అమరేందర్ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
విషాదం : రెండంతస్తుల భవనం పైనుంచి పడి బాలుడు మృతి
ప్రారంభమైన అంతర్రాష్ట్ర రాకపోకలు
ఉజ్జయిని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు
పిజ్జాలంటే ఇష్టమన్న మీరాబాయి.. జీవితకాలం ఫ్రీగా ఇస్తామన్న డొమినోస్
చేపల వేటకి వెళ్లి వ్యక్తి గల్లంతు