మంచిర్యాల, ఆగస్టు 15, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాలలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా తారుమారయ్యాయి. మొన్నటి వరకూ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడిగా ఉన్న మంతెన జగన్మోహన్రావు మంత్రి వివేక్తో చీకటి ఒప్పందం నడిపిస్తున్నారని ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలు ప్రచురించింది. ‘మంత్రి నీడలోకి జగన్నాటక సూత్రధారి’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన కథనాలు అక్షరసత్యాలు అయ్యాయి. ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి క్షిణించిన సమయంలో ఆయన తర్వాత జగన్మోహన్రావు ఎమ్మెల్యే రేసులో ఉన్నట్లుగా ప్రచారం జరిగింది.
ఈ మేరకు జగన్ మంత్రి వివేక్తో రహస్య చర్చలు జరిపినట్లు గతంతో విశ్వసనీయ సమాచారం ‘నమస్తే తెలంగాణ’కు అందింది. ఈ మేరకు మంత్రి నీడలోకి జగన్నాటక సూత్రధారి, రచ్చకెక్కిన జగన్నాటకం శీర్షికన కథనాలు ప్రచురించిన విషయం విదితమే. ఈ నెల 15, 16 తేదీల్లో మంత్రి సమక్షంలో జగన్ బలనిరూపణ చేయనున్నారనే కథనాలు సైతం వెలువరిచింది. అందుకు తగ్గట్టుగానే శనివారం సంగారెడ్డిలో జరిగిన సీఎం సభలో జగన్మోహన్ కనిపించడం మంచిర్యాల జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ విషయం మంచిర్యాల ఎమ్మెల్యేకు మింగుడుపడకుండా మారింది. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావుతో కొంతకాలంగా అంటీముట్టన్నట్లుగా ఉంటున్న జగన్ ప్రస్తుతం సీఎం సభలో పాల్గొని తన బలాన్ని మంచిర్యాల నియోజకవర్గంలో చూపించేందుకు ఈ వేదికను కేంద్రంగా చేసుకున్నట్లు తెలుస్తున్నది. మంత్రి వివేక్ అండదండలు జగన్మోహన్కు పుష్కలంగా ఉన్నాయని, ఈ బలంతోనే జగన్ సీఎంతో సన్నిహితంగా మెదులుతూ ముందుకు సాగుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.