గద్వాల, ఆగస్టు 15 : యువత స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను ఆదర్శంగా తీసుకొని ముం దుకు సాగాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు గద్వాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్లో పార్టీ నియోజకవర్గ నేత బాసు హనుమంతునాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించగా కార్యక్రమానికి అలంపూర్ ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై జెండావిష్కరణ చేశారు. అనంతరం అక్కడే ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ పదేళ్ల అనతికాలంలో దేశానికే ఆదర్శరాష్ట్రంగా నిలిచిందన్నారు.
అమరుల త్యాగాలను స్మరించుకుంటూ స్వా తంత్య్ర ఫలాలు చివరి గడప వరకు అందించి, దేశ సమగ్ర అభివృద్ధిలో అందరూ పాల్గొనాలని కోరా రు. గద్వాల నియోజకవర్గ నాయకుడు బాసు హనుమంతునాయుడు మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల నిస్వార్థ పోరాట స్ఫూర్తి నాటి నేతల దార్శానిక నాయకత్వం, సకల జనుల త్యాగపూరిత భాగస్వామ్యమే దేశానికి స్వాతంత్య్రం అందించాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు అనిత, మంజులరాణి, లత, సంటెన్న, పులపాటి వెంకటేశ్, మోహన్యాదవ్, గోపాల్, చిన్నరాముడు, జగదీశ్, నర్సింహులు మున్సిపల్ మాజీ చైర్మన్ కేశవ్, నాయకులు నాగర్దొడ్డి వెంకట్రాములు, కురువ పల్లయ్య, రాఘవేంద్రరెడ్డి, మోనేశ్ పాల్గొన్నారు.