దంతాలపల్లి, మార్చి 29 : మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల గ్రామంలో నెలకొన్న తాగు నీటి సమస్యను వెంటనే పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. తాగునీటి కోసం స్థానికులు ఖాళీబిందెలతో ఆందోళన చేసిన విషయమై శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’ ప్రధాన సంచికలో ‘తాగునీటికి యాతన’ శీర్షికన ప్రచురితమైన కథనానికి మిషన్ భగీరథ ఈఈ కృష్ణారెడ్డి, డీపీవో హరిప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ డీఈ అనూష స్పందించి గ్రామంలో పర్యటించారు.
ఈ సందర్భంగా తాగునీటి సమస్యపై అధికారులు ఆరా తీయగా గతంలో మిషన్ భగీరథ నీరు బాగానే వచ్చేదని, ఇప్పుడు సరిగ్గా రావడం లేదని గ్రామస్థులు తెలిపారు. 20 రోజులుగా తమ ఏరియాకు చుక్కనీరు రావడం లేదని తెలుపగా వెంటనే మిషన్ భగీరథ నీటి విడుదల శాతాన్ని పెంచి తాగునీటి సరఫరా చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. తక్షణమే గ్రామంలో ఉన్న బోర్లకు మోటర్లను ఏర్పాటు చేసి తాగునీరు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.