KTR | సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. సోనియాగాంధీని దెయ్యం, పిశాచి, బలి దేవత అని అన్న నువ్వా రాజీవ్ గాంధీ మీద ప్రేమ ఒలకబోసేది అని విమర్శించారు. దొడ్డి దారిన పీసీసీ ప్రెసిడెంట్ అయ్యి ఇవాళ రాజీవ్గాంధీ మీద నువ్వు ఒలకబోస్తున్న కపట ప్రేమ అసలు రంగు అందరికీ తెలుసని అన్నారు.
నీ ఆలోచనల్లో కుసంస్కారం.. నీ మాటలు అష్ట వికారం అని సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ తల్లి కోసం నిర్ణయించిన స్థలంలో కాంగ్రెస్ నాయకుల విగ్రహాలు ఏంటని అడిగితే కారుకూతలు కూస్తావా అని నిలదీశారు. తెలంగాణ ఉద్యమం గుండెల్లో గునపాలు దించిన నీ చేతులతో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినా అది అవమానమే అని విరుచుకుపడ్డారు. గాంధీ విగ్రహం గాడ్సే పెడితే ఎట్లుంటదో అట్లుంటది అని ఎద్దేవా చేశారు. తెలంగాణకు అక్కరకు రాని వాళ్ల బొమ్మలను తొలగిస్తాం అని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని మళ్లీ చెబుతున్నాం.. రాసి పెట్టుకో అని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణ తల్లిని సమున్నతంగా ప్రతిష్టిస్తామని స్పష్టం చేశారు.
కాగా, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతున్నందుకే ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇచ్చారని కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలపైనా కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్పై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు ముందు ఈ విషయాలను తమ దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు.
– ఈడీ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరూ కూడా 2015 డిసెంబర్లో బెయిల్ పొందారు.
– ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇండియా కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ చేరింది. ఆ పార్టీ నాయకుడు మనీశ్ సిసోడియా వారం కిందట బెయిల్కొచ్చారు.
– తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఓటుకు నోటు కేసులో 2015 నుంచి బెయిల్ మీదే తిరుగుతున్నారు.
ఇవన్నీ కూడా కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే జరిగాయని కేటీఆర్ అన్నారు. పై అంశాలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా పార్టనర్స్ అని అనుకోవచ్చా? అని ప్రశ్నించారు.