కరీంనగర్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/సిరిసిల్ల రూరల్: ‘మళ్లీ ఉరికొయ్యకు నేతన్న’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితమైన నేపథ్యంలో సిరిసిల్లకు కాంగ్రెస్ నేతలు తరలివచ్చారు. కానీ, ఆత్మహత్యలకు పాల్పడిన వారి కుటుంబాలను ఆదుకునే విషయంలోగానీ, నేతన్నలు కష్టాలు తీర్చే విషయంలో కానీ స్పష్టమైన ప్రకటన చేయకపోవడం నిరాశ పరిచింది.
నేత కార్మికుల కుటుంబాలకు అండగా ఉంటామని, ఎన్నికల తరువాత నేత కార్మికులకు ప్రత్యేక పాలసీలను రూపొందించి అమలుచేస్తామని చెప్పి చేతులు దులుపుకున్నారు. అంతకు మించి మరే సహయమూ ప్రకటించలేదు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రోహిత్చౌదరి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు శనివారం సిరిసిల్లకు వచ్చి ఆత్మహత్యలు చేసుకున్న కార్మికుల కుటుంబాలను పరామర్శించారు.
తంగళ్లపల్లిలోని అంకారపు మల్లేశం, సిరిసిల్ల పట్టణంలోని పద్మనగర్కు చెందిన అడిశెర్ల సాయి కుటుంబాలను పరామర్శించి, వారి కుటుంబ పరిస్థితులు, ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి పొన్నం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. నేతలు ఆత్మహత్యలు చేసుకోవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని విజ్ఞప్తి చేశారు.
వస్త్ర ఉత్పత్తి పెంచి అందరికీ ఉపాధి కల్పిస్తామని, సిరిసిల్లలో తయారైన వస్ర్తాలకు మార్కెటింగ్ చేయడానికి అవసరమైతే హైదరాబాద్లో ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. నేతన్నలకు గతం కంటే అదనంగా ఆర్డర్లు ఇచ్చేలా తమ పాలసీ ఉంటుందని, ఎన్నికల కోడ్ కారణంగా అది ఆగిందని పేర్కొన్నారు. చేనేత మీద కేంద్ర ప్రభుత్వం 12% జీఎస్టీ విధిస్తే పార్లమెంటు సభ్యుడిగా బండి సంజయ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దీపాదాస్ మున్షీ మాట్లాడుతూ.. సిరిసిల్లలో నేతకార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం దురదృష్టకరమని, వారికి అండగా ఉంటామని పేర్కొన్నారు.
గత ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని, దీంతో నాలుగు నెలలుగా పవర్లూం బంద్ అయిందని చెప్పారు. కార్మికుల ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని, ఇది రాజకీయాలు చేయాల్సిన సమయం కాదని, తాము కూడా రాజకీయాలు చేయడానికి రాలేదని చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ నేత కార్మికులకు ప్రత్యేక పాలసీలను రూపొందిస్తుందని, ఎన్నికల తర్వాత వీటిని అమలు చేసి, కార్మికులకు ఆదుకుంటామని చెప్పారు.
కోడ్కు ముందే సంక్షోభం
నిజానికి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి గురైంది. సమస్య పరిష్కారం కోసం ఎన్నికల కోడ్ రాకముందే సిరిసిల్ల నేతన్నలు కదంతొక్కారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే తమకు ఆర్డర్లు ఇచ్చి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేయడంతోపాటు సమ్మెకు కూడా పిలుపునిచ్చారు. ఎన్నికల కోడ్ రాకముందే ఒకరిద్దరు ఉపాధి లేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో సమస్య తీవ్రతను వివరిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ సైతం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి లేఖ రాశారు.
అప్పుడే సమస్య తీవ్రతను గుర్తించి, ఆర్డర్లు ఇచ్చి న్యాయం చేసి ఉంటే, మరికొంత మంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తలెత్తేది కాదు. ఆర్డర్లు ఇచ్చి ఉపాధి కల్పించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం దాటవేత ధోరణి అవలంభించడంపై నేతన్నలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పాతబకాయిలను వెంటనే చెల్లించడంతోపాటు కొత్త ఆర్డర్లు ఇచ్చి సాంచాలు నడిచేలా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బీఆఆర్ఎస్ ప్రభుత్వం ఏటా రూ.350 కోట్ల వరకు వర్క్ ఆర్డర్లు ఇస్తే, కాంగ్రెస్ రూ.50 కోట్ల ఆర్డర్లు మాత్రమే ఇచ్చిందని, దీంతో పనుల్లేక కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.