మహబూబ్నగర్ : ఎట్టి పరిస్థితిలోనూ కేంద్రం వరి ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అవసరమైతే సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీ వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. వరి కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జడ్పీ గ్రౌండ్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టి మంత్రి మాట్లాడారు.
ఎన్నికలప్పుడు నరేంద్ర మోదీ, సుష్మ స్వరాజ్ ఇక్కడికి వచ్చి పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం జాతీయ ప్రాజెక్ట్గా చేస్తామని అన్నారు. ఆ ఊసే మరిచారని విమర్శించారు. ఏడేళ్ల కాలంలో రాష్ట్రం, పాలమూరు ఎంతగా అభివృద్ధి చెందిందో చూడాలన్నారు.
కర్ణాటకలోని రాయచూరును బీజేపీ ఎమ్మెల్యే తెలంగాణాలో కలపాలన్నడు. నిజామాబాద్ జిల్ల సరిహద్దులోని 25 గ్రామాలు కూడా తెలంగాణాలో కలపాలని తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇది తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధికి నిదర్శనమన్నారు. ఇక్కడ జరుగుతున్న అభవృద్ధి, సంక్షేమ పనులు మీరెందుకు చేయడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఇక్కడి భూముల్లో ఏ పంటలు పండుతాయో వాటినే పండిస్తాం. ఇక్కడ ఎమైనా ఆపిల్ పండుతుందా అని ఎద్దేవా చేశారు. మేం వరి పంట సాగు చేస్తే మీరు కొనం అంటే ఎట్లా అని ప్రశ్నించారు. ఏ విషయంలోనైనా రాజకీయం చేయండి రైతుల విషయంలో మాత్రం రాజకీయాలు వద్దు అని హితవు పలికారు. ప్రజలను కాన్ఫ్యూజ్ చేయకండి.
చేస్తే మీరు కన్ఫూజ్ అవుతారని మంత్రి తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కండ్లు తెరిచి రైతులు పండించిన యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మంత్రి తెలిపారు. మత్రి వెంట జడ్పీ చైర్ పర్సన్ స్వర్ణమ్మ, జిల్లా టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. అంతకు ముందు తెలంగాణ చౌరస్తా నుంచి జడ్పీ వరకు ఎడ్ల బండ్లపై ర్యాలీ నిర్వహించారు.