వనపర్తి : నాదర్గుల్ ( Nadergul ) లో 373 ఎకరాల భూమిని కబ్జాను బయటపెట్టడంతో మంత్రి పొంగులేటి ( Ponguleti Srinivas Reddy ) కి మతిస్థిమితం కోల్పోయి బజారు భాషలో మొరుగుతున్నారని మాజీ మంత్రి హరీష్రావు ( Harish Rao ) ఆరోపించారు. భూముల విషయంలో మీడియా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా నీళ్లు నమిలి పారిపోయాడని విమర్శించారు.
పొంగు ‘లూటీ ’ అక్రమాలను అడుగడుగునా ఎండగడుతూనే ఉంటామని హెచ్చరించారు. మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తదితరులతో కలిసి వనపర్తిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. నాదర్గుల్ భూముల వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయి అబద్ధాలతో బొంకులేటి రంకేలేస్తున్నాడని ఆరోపించారు
. ఎన్ని రంకెలేసినా, కబ్జాలు, అవినీతి బయటపెడుతూనే ఉంటామని, వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్ చేసింది. మా అధికారులను పంపి మేమే ఆ దొంగల్ని పట్టుకున్నాం. నోటీసులు ఇచ్చినామని స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పినప్పుడు మౌనంగా తలకాయ కిందికి వేసి ఎందుకు కూర్చున్నావని పొంగులేటిని ప్రశ్నించారు.
12 రోజుల తర్వాత ఇప్పుడు జ్ఞానోదయం అయి నేను ఒక్కడినే అవినీతి పరుడిని కాదు.. సీఎం, నా సహచర మంత్రులందరూ అవినీతి పరులేనని పరోక్షంగా ఒప్పకున్నాడని విమర్శించారు. అడ్డంగా దొరికిపోయిన ఫ్రస్టేషన్ లో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, జూపల్లి కృష్ణారావుల కుంభకోణాలను ఆయననే బయట పెట్టారని ఆరోపించారు. ఇప్పటికైనా తప్పును ఒప్పుకుని, ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నాదర్గుల్ భూములు
ప్రభుత్వ భూములైతే ఎందుకు హైడ్రా స్పందించడం లేదని నిలదీశారు. పేదల ఇండ్లను కూలుస్తున్న హైడా పొంగు లూటీ భూములు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే లు అల వెంకటేశ్వర్ రెడ్డి, అంజయ్య యాదవ్, రాష్ట్ర నాయకులు నాగం తిరుపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.