Harish Rao | ఇండస్ట్రియల్ పార్కుల పేరిట పేదల భూములను కాంగ్రెస్ సర్కార్ లాక్కుంటున్నదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు మండిపడ్డారు. ప్రభుత్వం ఎందుకంత భయపడుతోందని ఆయన ప్రశ్నించారు. ప్రజలు ఎక్కడైనా నిరసన తెలిపే హక్కు ఉందని కాంగ్రెస్ చెప్పిందని తెలిపారు. బలహీనవర్గాల గొంతుకగా పనిచేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. పరిగి పర్యటనకు వెళ్లకుండా తనతో పాటు సబితా ఇంద్రారెడ్డి, ఇతర బీఆర్ఎస్ నాయకులను హౌస్ అరెస్టు చేయడంపై ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నదని హరీశ్రావు అన్నారు.
కాళ్లాపూర్ దగ్గర ఇవాళ ఒక మీటింగ్ పెట్టుకున్నామని హరీశ్రావు తెలిపారు. కానీ అక్కడి టెంట్లను పీకేశారని.. మహిళలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారని మండిపడ్డారు. భూ బాధితులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు. మమ్మల్ని అడ్డుకున్నా తప్పకుండా కాళ్లాపూర్ వెళ్తామని హరీశ్రావు స్పష్టం చేశారు. మా పోరాటం ఆగదు.. రైతుల గొంతుకగా మారతామని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి రైతు పక్షపాతి అయితే టెండర్ పిలిచి కోహెడ పండ్ల మార్కెట్ నిర్మించాలని హరీశ్రావు అన్నారు. చిల్లర పనులు మానేయాలి.. భూముల వెంట పడవద్దని సూచించారు. 22A నిషేధిత జాబితా రివ్యూ చేసి తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. వెంటనే ఇండస్ట్రియల్ నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలన్నారు. రైతులకు తిరిగి భూములు ఇవ్వాలని సూచించారు.
పిచ్చోడి చేతిలో రాయిలా తెలంగాణ మారిందని హరీశ్రావు విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు ఏం చేస్తారో అర్థం కావడం లేదని అన్నారు. హైడ్రా పేరుతో పేదల గుడిసెలు కూల్చారని తెలిపారు. మూసీ పేరుతో కూల్చేందుకు యత్నించారని తెలిపారు. యూనివర్సిటీ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. కోహెడ పండ్ల మార్కెట్ స్థలాన్ని కూడా బంధువులకు కట్టబెట్టే యత్నం చేస్తున్నారని విమర్శించారు.
పచ్చటి భూములపై ఎందుకు పడ్డారని సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్రావు మండిపడ్డారు. ఇది భూసేకరణ కాదు.. దళిత బలహీనవర్గాలపై ప్రభుత్వం దండయాత్ర అని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములకు పట్టాలిస్తామని అన్నారని గుర్తుచేశారు. పట్టాల మాట దేవుడెరుగు.. ఉన్న భూములు లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్లలో ఇండస్ట్రీల పేరుతో 10 వేల ఎకరాలు లాక్కున్నారని తెలిపారు. మరో 40 వేల ఎకరాలు లాక్కునేందుకు ప్రణాళికలు వేశారని పేర్కొన్నారు. స్పీకర్, సీఎంలు రక్షకులుగా ఉంటారా.. భక్షకులుగా మారతారా అని నిలదీశారు. దళితులు, గిరిజనుల భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని హరీశ్రావు మండిపడ్డారు. రేవంత్ ఆలోచనలు భూమి చుట్టే తిరుగుతున్నాయని హరీశ్రావు ఎద్దేవా చేశారు.