Rythu Bharosa | రైతు భరోసా పథకంపై ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళిశాఖల అధికారులతో వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రలు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిలిపివేసిన వ్యవసాయ పథకాలు, కారణాలు తెలిపాలని కోరారు. కేంద్ర ప్రభుత్వంతో మ్యాచింగ్ ద్వారా వచ్చే పథకాలు, నిధులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పంటల బీమాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలు, రాబోయే సీజన్కు పంటల బీమాకు సంబంధించి పిలువాల్సిన టెండర్లపై చర్చించారు.
రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల్లో ఉన్న వ్యవసాయ కళాశాలలు, ఇప్పటికీ కళాశాలలు లేని జిల్లాల వివరాలు తెలుసుకున్నారు. సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యకలాపాలపై ఆరా తీశారు. వ్యవసాయ కళాశాలలో విత్తన అభివృద్ధి తీరుపై చర్చించారు. రైతు సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నామని, వ్యవసాయం అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం అన్నారు. రైతు భరోసాకు సంబంధించి రైతుల అభిప్రాయం ఎలా ఉంది? ఎలా ముందుకు వెళ్తే మంచిది ? అనే విషయాలు రైతుల ద్వారా తెలుసుకుంటే మంచిదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అభిప్రాయ సేకరణ చేసి రైతులను భాగస్వాములను చేయాలని, అందులో మంత్రులు పాల్గొంటే కార్యక్రమం మరింత ప్రయోజనాత్మకంగా ఉంటుందన్నారు.
డ్రిప్ ఇరిగేషన్కు నిధులు నిధులు కేటాయిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని అధికారులు తెలిపారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా పథకాలకు ఇప్పటివరకు చేస్తున్న ఖర్చు, ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా రాబోయే రోజుల్లో పెరుగుతున్న బడ్జెట్పై సమీక్ష చేశారు. ఆయిల్ ఫామ్ సాగు, నేతన్న చేయూత, నేతన్న బీమా పథకాలు ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలపై చర్చించారు. రాష్ట్ర విభజన చేనేత కార్మికుల జీవితాల్లో వచ్చిన మార్పులపై రా తీశారు. సిరిసిల్ల కో-ఆపరేటివ్ సొసైటీ, టెక్స్టైల్ వ్యాపారస్తులు ప్రభుత్వం నుంచి ఏ పద్ధతిలో ప్రయోజనం పొందుతున్నారో అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రఘునందన్ రావు, ఆర్థిక శాఖ అడిషనల్ సెక్రెటరీ హరిత, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.